బైక్ లవర్లకు బ్యాడ్ న్యూస్... 27 ఏళ్లుగా యూత్ను ఆకట్టుకుంటున్న బండిని బంద్ చేయనున్న యమహా
ప్రపంచవ్యాప్తంగా బైక్ రైడర్లను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ టూ వీలర్ల తయారీ సంస్థ యమహా, మోటార్ సైకిల్ రంగంలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి ముగింపు పలకనుంది. తన పోర్ట్ఫోలియోలోనే అత్యంత పురాతనమైన, పాపులర్ అయిన యమహా ఆర్6 (Yamaha R6) స్పోర్ట్బైక్ ఉత్పత్తిని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
దాదాపు 27 ఏళ్ల క్రితం, అంటే 1999లో మొదటిసారిగా లాంచ్ అయిన ఈ బైక్, కాలక్రమేణా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఐకానిక్ మిడిల్వైట్ స్పోర్ట్బైక్గా నిలిచింది. కఠినమైన యూరో-5 ఉద్గారాల నిబంధనల కారణంగా 2021లోనే దీనిని రోడ్ బైక్గా విక్రయించడం ఆపేసినప్పటికీ, గత ఐదేళ్లుగా కేవలం ట్రాక్పై రేసింగ్ కోసం మాత్రమే విక్రయిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దానికి కూడా స్వస్తి పలకాలని యమహా జపాన్ నిర్ణయించింది.

యమహా జపాన్ విడుదల చేసిన అధికారిక ప్రెస్ రిలీజ్ ప్రకారం.. ఈ ఐకానిక్ బైక్ చివరి ఎడిషన్ అయిన యమహా R6 రేస్ బేస్ మోడల్ డెలివరీలు ఫిబ్రవరి 2027 లో ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ రెండు ప్రత్యేకమైన బుకింగ్ విండోలను అందుబాటులోకి తెచ్చింది. మొదటి బుకింగ్ విండో జూలై 1, 2026 న ప్రారంభం కాగా, ఇది జూలై 31, 2026 తో ముగియనుంది.
ఇక రెండో బుకింగ్ విండో ఆగస్టు 1, 2026న ఓపెన్ అయ్యి, అదే నెల చివరి రోజున ముగుస్తుంది. ఈ గడువు ముగిసిన తర్వాత జపాన్ మార్కెట్లో R6 బైక్ విక్రయాలు శాశ్వతంగా ఆగిపోతాయి. ఐరోపా, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం స్టాక్ ఉన్నంత వరకు ఇవి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ట్రాక్ మోడల్లో హెడ్లైట్లు, నంబర్ ప్లేట్ వంటి రోడ్-లీగల్ ఫీచర్లు ఉండవు, కానీ ఇందులో పవర్ఫుల్ 599cc ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్తో పాటు పెద్ద ఆర్1 బైక్ నుంచి సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ను తీసుకున్నారు.

యమహా సంస్థ తన ఆర్6 బైక్ను అధికారికంగా భారతదేశంలో ఎప్పుడూ లాంచ్ చేయకపోవడం గమనార్హం. అయినప్పటికీ మన దేశంలో ఈ బైక్కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రస్తుతం 600cc సూపర్ స్పోర్ట్ కేటగిరీలో భారత్లో లభిస్తున్న ఏకైక జపాన్ బైక్ కవాసాకి నింజా జెడ్ఎక్స్-6ఆర్. లేటెస్ట్ కఠినమైన ఉద్గార నియమాలను తట్టుకొని నిలబడిన ఈ కావాసాకి బైక్ ప్రస్తుతం భారత మార్కెట్లో విజయవంతంగా అమ్ముడవుతోంది. మనదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మరోవైపు, యమహా కంపెనీ భారతీయ మార్కెట్లోని తన బైకులు, స్కూటర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే 2026 నాటి తాజా అప్డేట్ ప్రకారం పలు మోడళ్లపై ధరల భారం పడింది. యమహా పాపులర్ నియో-రెట్రో బైక్ XSR 155 ధరలో రూ.1,000 వరకు పెరుగుదల కనిపించింది. అయితే, దీని బేస్ వేరియంట్ అయిన మెటాలిక్ బ్లూ ధరను మాత్రం రూ.1,49,990 వద్దే ఉంచడం వల్ల ప్రారంభ ధర రూ.1.5 లక్షల లోపే ఉంది. అలాగే, ఫేసినో 125 (Fascino 125) స్కూటర్ లోని హై-స్పెక్ డిస్క్ బ్రేక్, TFT క్లస్టర్ వేరియంట్లపై రూ.1,000 పెరిగింది.
కంపెనీ తన స్పోర్టీ స్కూటర్ RayZR 125లోని నాలుగు వేరియంట్ల ధరలను ఒకేసారి రూ.2,200 మేర పెంచింది. ఈ పెంపు తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.76,960 నుంచి రూ.89,760 మధ్యకు చేరాయి. అలాగే ఫ్లాగ్షిప్ స్కూటర్ అయిన యమహా Aerox 155 (స్టాండర్డ్, వర్షన్ S) ధర ఏకంగా రూ.2,800 పెరిగింది.
ఇదే విధంగా FZ-X బైక్ స్టాండర్డ్ మోడల్పై రూ.2,500, హై-ఎండ్ DLX వేరియంట్పై రూ.2,800 పెరిగాయి. ఇక కాలేజీ కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకునే MT-15 బైక్ ధరపై ఏకంగా రూ.3,800 పెంచగా, కంపెనీ పోర్ట్ఫోలియోలోనే అత్యధికంగా R15 బైక్ ధరను రూ.4,900 మేర పెంచడం గమనార్హం.


Click it and Unblock the Notifications