ఈకోస్పోర్ట్ బుకింగ్లను నిలిపివేసిన ఫోర్డ్ ఇండియా
ఫోర్డ్ ఇండియా గడచిన జూన్ నెలలో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' దేశీయ విపణిలో ఊహించని రీతిలో విజయం సాధించిన సంగతి తెలిసినదే. ఆకట్టుకునే కాంపాక్ట్ డిజైన్, సరమైన ధర, సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఇది కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. దీంతో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ను సొంతం చేసుకోవాలనుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా ఈ మోడల్ వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: ఈ యాక్ససరీలతో మీ ఈకోస్పోర్ట్ను మరింత అందంగా మార్చుకోండి
మార్కెట్ వర్గాల సమాచారం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మోడల్కు ఉత్పత్తికి మించి డిమాండ్ వస్తుండటంతో, దేశవ్యాప్తంగా ఫోర్డ్ ఇండియా అధీకృత డీలర్లు ఈ మోడల్ కోసం బుకింగ్లను (అన్ని వేరియంట్లు) స్వీకరించడాన్ని కొంత కాలం పాటు నిలిపి వేసినట్లు తెలుస్తోంది. ముందుగా పెండింగ్ బుకింగ్లను క్లియర్ చేసిన తర్వాత కొత్త బుకింగ్లను స్వీకరించాలని కంపెనీ/డీలర్లు నిర్ణయించారు. ఈకోస్పోర్ట్కు ఇప్పటికే 60,000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చాయి.
గతంలో అధిక డిమాండ్ కారణంగా, ఫోర్జ్ ఇండియా తమ పాపులర్ 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు అన్ని రకాల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ల బుకింగ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి ఫోర్డ్ ఈకోస్పోర్ట్కు 3 నుంచి 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.
ఫోర్డ్ ఇండియా గడచిన జూన్ నెల నుంచి నవంబర్ నెలాఖరు నాటికి సుమారు 25,000 యూనిట్లకు పైగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీలను డెలివరీ చేసింది. అంటే, ఈ లెక్కన ఇంకా సుమారు 35,000 యూనిట్లకు పైగా పెండింగ్ ఆర్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ క్లియర్ అయితే కానీ కొత్త బుకింగ్లను స్వీకిరంచే అవకాశం కనిపించడం లేదు. ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు కంపెనీ సత్వర చర్యలు తీసుకోకపోతే, కొనుగోలుదారులు తమ రూటు మార్చుకొని, వేరే మోడల్ను కొనే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications









