ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ.. ఏప్రిల్ నుంచి ధరలు తగ్గే అవకాశం!
కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుముఖం పట్టే ఆస్కారం కనిపిస్తోంది. భారత ప్రభుత్వం తమ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఈఎమ్ఎమ్పి)లో భాగంగా, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఆఫర్ చేయాలని యోచిస్తోంది. వాస్తవానికి ఈ ప్రణాళిక ఎప్పుడో అమలు కావల్సి ఉన్నప్పటికీ, ఆర్థిక మందగమనంతో పాటు పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది.
ఇటీవల ముంబైలో జరిగిన 4వ సియామ్ డీజిల్ కాన్ఫరెన్స్లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతా సజావుగా జరిగినట్లయితే, ఏప్రిల్ 2014 నుంచి ఎన్ఈఎమ్ఎమ్పి ప్రణాళికను ఎట్టకేలకు అమల్లోకి తీసుకువస్తామని వారు తెలిపారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాటానికి ముందు, భారీ పరిశ్రమల శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖను కలవనుంది.
ఏడేళ్ల ప్రణాళికకు గాను మొత్తం రూ.12,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కాగా.. మొదటి సంవత్సరంలో ఈ ప్రణాళిక కోసం రూ.2,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఆఫర్ చేయవచ్చని అంచనా. ఈ ప్రోత్సాహకాలు ఏయే రూపంలో ఉంటాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ, 2020 నాటికి రవాణా విభాగంలో పర్యావరణ సాన్నిహిత్యను పెంపొందించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ ప్రణాళిక అమల్లోకి ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గి, వీటి వినియోగం పెరిగే ఆస్కారం ఉంటుంది. రానున్న ఏడేళ్లలో 60 నుంచి 70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు (ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలు కలిపి) భారత రోడ్లపై పరుగులు తీసే ఆస్కారం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాన్ని చేరుకోగలిగినట్లయితే, రూ.40,000 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి సమాచారం
ప్రస్తుతం భారత్లో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ మహీంద్రా రేవా. ప్రభుత్వం సబ్సిడీని ఆఫర్ చేయకపోయినట్లయితే, కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయటం నిలిపివేస్తామని ఈ కంపెనీ ఇటీవలే సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసినదే. ఈ వాహనాలపై ప్రభుత్వం సబ్సిడీని ఆఫర్ చేసినట్లయితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు దిగి రావటమే కాకుండా, మరిన్ని కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కూడా మార్గం సుగమం అవుతుంది.


Click it and Unblock the Notifications









