జనవరి నుంచి కార్ల ధరలను పెంచనున్న మెర్సిడెస్ బెంజ్
కొత్త సంత్సరంలో లగ్జరీ కార్ల ధరలు కొండెక్కి కూర్చోనున్నాయి. ఈ సెగ్మెంట్లోని దాదాపు అన్ని కార్ కంపెనీల వచ్చే జనవరి 2014 నుంచి తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచనున్నాయి. ఇప్పటికే బిఎమ్డబ్ల్యూ ఇండియా, ఆడి ఇండియా కంపెనీలు వచ్చే ఏడాది ఆరంభం నుంచే ధరలు పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా ఈ జాబితాలోకి మెర్సిడెస్ బెంజ్ ఇండియా వచ్చి చేరింది.
వచ్చే నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకు పెంచుతామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ధరల పెంపుకు గల కారణాలను మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు. బిఎమ్డబ్ల్యూ ఇండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ కార్ల ధరలను 7 శాతం నుంచి 10 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించగా, జనవరి 1, 2014 నుంచి కార్ల ధరలను మోడల్ను బట్టి 3 శాతం నుంచి 5 శాతం మేర పెంచనున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: కొత్త కారు కొనేందుకు ఇదే సరైన సమయం..!

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో తమ కాంపాక్ట్ కారు ఏ-క్లాస్ మొదలుకొని స్పోర్ట్స్ కారు ఎస్ఎల్ఎల్ ఏఎమ్జి వరకు విస్తృతస్థాయి ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. భారత మార్కెట్లో కంపెనీ అందిస్తున్న లగ్జరీ కార్ల ధరల రూ.22 లక్షలు మొదలుకొని రూ.3 కోట్ల వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








