జిఎస్టి ప్రభావం: మారుతి సుజుకి కార్ల ధరలు తగ్గుతున్నాయ్!
ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మీద కూడా జిఎస్టి ప్రభావం పడుతోంది. మారుతి లైనప్లోని కొన్ని ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే, మరికొన్ని మోడళ్ల మీద ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST)ని అమలు చేయడానకి కేంద్రం సిద్దమయ్యింది. నూతన జిఎస్టి ఆటోమొబైల్ సంస్థల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని ఉత్పత్తుల మీద ధరలు పెరుగుతుంటే, మరికొన్ని ఉత్పత్తుల మీద ధరలు తగ్గుతున్నాయి.

భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మీద కూడా జిఎస్టి ప్రభావం పడుతోంది. మారుతి లైనప్లోని కొన్ని ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే, మరికొన్ని మోడళ్ల మీద ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఆ వివరాలు నేటి కథనంలో....

జిఎస్టి ప్రకారం, అన్ని ఆటోమొబైల్స్ మీద నిర్దిష్ట మరియు గరిష్ట ట్యాక్స్ 28 శాతంగా ఉంది. దీనికి తోడుగా వివిధ రకాల వాహన శ్రేణి మీద అదనంగా సెస్ నిర్ణయించింది జిఎస్టి మండలి.

నిర్ధిష్టంగా ఉన్న 28 శాతంతో పాటు 1,200సీసీ సామర్థ్యం లోపు ఉన్న పెట్రోల్ కార్ల మీద ఒక శాతం, 1,500సీసీ సామర్థ్యం లోపు ఉన్న డీజల్ కార్ల మీద 3 శాతం సెస్ అదే విధంగా పెద్ద ఎస్యూవీలు, లగ్జరీ వాహనాల మీద 15 సెస్ నిర్ణయించింది.

సెడాన్, క్రాసోవర్ మరియు మధ్య స్థాయి ఎస్యూవీల మీద జిఎస్టి అమలు చేస్తే వాటి ధరలు తగ్గుతాయి. జిఎస్టిలో ఇలాంటి వాహనాల మీద ట్యాక్స్ మునుపటితో పోల్చితే తక్కువే కాబట్టి ధరలు తగ్గుతున్నాయి.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఎస్యూవీ మీద గరిష్టంగా రూ. 70,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

అంతే కాకుండా మారుతి తమ బెస్ట్ సెల్లింగ్ కార్లయిన ఆల్టో, వ్యాగన్ ఆర్, సెలెరియో మరియు స్విఫ్ట్ కార్ల మీద రూ 25,000 నుండి 35,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

జిఎస్టి మారుతి సుజుకి సంస్థకు అంతా మంచి చేయలేదు. ఎందుకంటే జిఎస్టి ప్రకారం, హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ 43 శాతంగా ఉంది. మునుపు ఉన్న ట్యాక్స్తో పోల్చుకుంటే మూడు రెట్లు పెరిగింది.

మారుతి సుజుకి సియాజ్ మరియు ఎర్టిగా వాహనాల్లోని డీజల్ వేరియంట్లలో డీజల్ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం చేసింది. ఇందుకోసం మారుతి వారి స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి(SHVS) అనే పేరుతో హైబ్రిడ్ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఇవి పూర్తి స్థాయి హైబ్రిడ్ వెహికల్స్గా రాణించలేకపోతున్నప్పటికీ, భారతీయ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం హైబ్రిడ్ వెహికల్ కెటగిరీలోనే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల అభివృద్ది మరియు అందుబాటులోకి తెచ్చే సంస్థలకు రాయితీలిచ్చే "ఫేమ్" నుండి సియాజ్ మరియు ఎర్టిగా వాహనాల ద్వారా మారుతి లాభపడేది. అయితే ఇప్పుడు హైబ్రిడ్ వాహనాల మీద ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో ఈ రెండు మోడళ్లతో ఆశించిన ఫలితాలు రావడం కాస్త కష్టమే.

ప్రభుత్వం 43 శాతం ట్యాక్స్ అమలు చేస్తే, సియాజ్ మరియు ఎర్టిగా హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ. 1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక మీదట వీటిని హైబ్రిడ్లో కాకుండా సాధారణ డీజల్ వెర్షన్లో ఉత్పత్తి చేయడం బెటర్. బ్రిజా మీద 3.5 శాత వరకు ధరలు పెరగనున్నాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నిజానికి జిఎస్టి అమలు మారుతి సుజుకి మీద పెద్ద ప్రభావం చూపదు. ఎందుకంటే మారుతి వద్ద ఉన్న అన్ని బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద ఉన్న ట్యాక్స్ జిఎస్టి ప్రకారం కొద్ది మేర తగ్గనుంది. అయితే హైబ్రిడ్ సియాజ్ మరియు ఎర్టిగా లతోనే మారుతి చిక్కులు. అయితే ఈ సమస్యను ఎదుర్కునేందుకు వీటి ఉత్పత్తిని నిలిపివేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.


Click it and Unblock the Notifications








