మారుతి సుజుకి కస్టమర్లకు ఊహించని షాక్
మారుతి సుజుకి రెగ్యులర్ షోరూమ్లు మరియు నెక్సాన్ విక్రయ కేంద్రాలో అందుబాటులో ఉంచిన అన్ని ప్యాసింజర్ కార్ల మీద ధరల పెంచాలని డిసైడ్ అయ్యింది.
మారుతి సుజుకి కంపెనీ కారును కొనే ఆలోచనలో ఉన్నారా...? అయితే వెంటనే సమీపంలో ఉన్న మారుతి షోరూమ్కు వెళ్లి మీకు నచ్చిన మారుతి సుజుకి కారును ఎంచుకోండి. ఎందుకంటే, మారుతి తమ అన్ని కార్ల మీద ధరలు పెంచడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి రెగ్యులర్ షోరూమ్లు మరియు నెక్సాన్ విక్రయ కేంద్రాలో అందుబాటులో ఉంచిన అన్ని ప్యాసింజర్ కార్ల మీద ధరల పెంచాలని డిసైడ్ అయ్యింది.

ప్రతి కారు మీద దాని మొత్తం ధరలో రెండు శాతం పెంచనున్నట్లు సమాచారం. ధరల పెంపు అనంతరం సవరించబడిన కొత్త ధరలు జూన్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి.

మారుతి సుజుకి ధరల పెంపు రూ. 5,000 నుండి గరిష్టంగా రూ. 25,000 వరకు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ధరల పెంపు గురించి మారుతి సుజుకి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ధరల పెంపుకు గల కారణాలు తెలియరాలేదు, అయితే పెట్టుబడి ఖర్చులు మరియు ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణా ఛార్జీలు అధికమవ్వడం వంటి కారణాల దృష్ట్యా ధరల పెంపు చేపట్టే అవకాశం ఉంది.

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయంగా అరెనా(రెగ్యులర్) మరియు నెక్సాన్(ప్రీమియం) షోరూమ్ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆల్టో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ మరియు వితారా బ్రిజా మోడళ్లను అరెనా షోరూముల్లో అందుబాటులో ఉంచింది.

అదే విధంగా మారుతి సుజుకి ప్రీమియం షోరూమ్ నెక్సాన్ వేదికగా, ఇగ్నిల్, బాలెనో, సియాజ్ మరియు ఎస్-క్రాస్ వంటి విభిన్న మోడళ్లను విక్రయిస్తోంది. మారుతి ఈ ఏడాది ప్రారంభంలో మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ కారును 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా లాంచ్ చేసింది.

అదనంగా ఈ ఏడాదిలో కొత్త తరం ఎర్టిగా, సియాజ్ ఫేస్లిఫ్ట్ మరియు కొత్త తరం వ్యాగన్ఆర్తో పాటు వ్యాగన్ఆర్ ఆధారిత 7-సీటర్ సోలియో మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఈ నాలుగు మోడళ్లను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది.

జూన్ 2018 నుండి ధరలు పెంచుతున్న కంపెనీలలో మారుతి సుజుకి మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. హ్యుందాయ్ ఇప్పటికే తమ అన్ని మోడళ్ల మీద జూన్ 1, 2018 నుండి 2 శాతం మేర ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా విపరీతంగా పెరుగుతున్న ఇంధన ధరలే ఇందుకు ప్రధారణమని తెలుస్తోంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల మీద ధరలు పెంపు చేపడుతున్నట్లు ప్రకటించాయి. మారుతి సుజుకి ధరల పెంపు గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. పలు ఇతర కార్ల కంపెనీలు కూడా ఇదే బాట పట్టనున్నాయి. అయితే, ఈ ధరల పెంపు కార్ల విక్రయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి.


Click it and Unblock the Notifications








