గుడ్ న్యూస్.. భారత్కు వస్తున్న ఫోర్డ్ రేంజర్ రాప్టర్ పికప్
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త పికప్ ట్రక్కును పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో ఫోర్డ్ పికప్ ట్రక్కులకు ప్రత్యేకమైన డిమాండ్ ఉండి. ఈ నేపథ్యంలో, ఫోర్డ్ తమ పాపులర్ పికప్ ట్రక్కులను భారత్కు కూడా పరిచయం చేయాలని నిర్ణయించుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఫోర్డ్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన 'రేంజర్ రాప్టర్' పిక్-అప్ ట్రక్ను భారతదేశంలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. రేంజర్ రాప్టర్ను పరిమిత సంఖ్యలో భారత్కు దిగుమతి చేసుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఫోర్డ్ రేంజర్ రాప్టర్ మంచి పెర్ఫార్మెన్స్ కలిగిన పిక్-అప్ ట్రక్, ఇది అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

ఆటోకార్ ఇండియా కథనం ప్రకారం, ఫోర్డ్ భారతదేశపు కొత్త దిగుమతి నిబంధనలను ఉపయోగించుకొని రేంజర్ రాప్టర్ను భారత్కు దిగుమతి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ కొత్త దిగుమతి నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు సంవత్సరానికి 2,500 వాహనాలను సికెడి (విడిభాగాల రూపంలో భారత్కు దిగుమతి చేసుకోవటం) మరియు సిబియు (పూర్తిగా విదేశాల్లో తయారు చేసిన వాహనాలను భారత్కు దిగుమతి చేసుకోవటం) దిగుమతి చేసుకోవచ్చు. ఇలా దిగుమతి చేసుకున్న వాహనాలకు ప్రత్యేకమైన హోమోలోగేషన్ అవసరం ఉండదు.

వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి ఫోర్డ్ రేంజర్ రాప్టర్ పికప్ ట్రక్ భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. అయితే, ఈ మోడల్ను సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్కు దిగుమతి చేసుకోనున్నారు కాబట్టి, మార్కెట్లో దీని ధర సుమారు రూ.70 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా.

ఫోర్డ్ రేంజర్ రాప్టర్లో శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ను ఉపయోగిస్తు్ననారు. ఇది గరిష్టంగా 213 పిఎస్ శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫోర్డ్ ఎండీవర్లో ఉపయోగిస్తున్న 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్నే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ పికప్ ట్రక్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్తో పాటుగా వివిధ రకాల టెర్రైన్ మోడ్స్ని కూడా కలిగి ఉంటుంది.

భారత రోడ్లను అధ్యయనం చేసేందుకు ఫోర్డ్ రేంజర్ రాప్టర్ ఎస్యూవీని కంపెనీ ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ పికప్ ట్రక్కును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ ఎవరెస్ట్ ఎస్యూవీ ఛాస్సిస్పై నిర్మిస్తున్నారు. ఫోర్డ్ ఎవరెస్ట్ను భారత మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ పేరుతో విక్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత్లో విడుదల కానున్న ఫోర్డ్ రేంజర్ రాప్టర్ డిజైన్ అంశాలు ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఎండీవర్లో కనిపించే హెడ్లైట్స్, టెయిల్ లైట్స్, ఫ్రంట్ గ్రిల్, బంపర్స్ మరియు అల్లాయ్ వీల్స్తో పాటుగా మరిన్ని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు కూడా ఈ పికప్ వాహనంలో కనిపించే ఆస్కారం ఉంది.

ఫోర్డ్ రేంజర్ రాప్టర్ 283 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ను కలిగి ఉండి, ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ఇది 800 మిమీ లోతున్న నీటిలో సైతం సమర్థవంతంగా దూసుకుపోతుంది ఇందుకోసం దీనిలో 285 మిమీ వెడల్పు గల టైర్లను అమర్చారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మోడల్ కోసం బుకింగ్లను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఫోర్డ్ ఇండియా మరియు మహీంద్రా ఆటోమొబైల్ కంపెనీలు రెండూ కలిసి భారత మార్కెట్ కోసం ఓ మిడ్-సైజ్ ఎస్యూవీని కూడా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఫోర్డ్-మహీంద్రా తమ వ్యాపార వ్యూహంలో భాగంగా, ఎక్స్యూవీ500 ప్లాట్ఫామ్ ఆధారంగా ఇరు కంపెనీలు కలిసి ఓ కొత్త మిడ్-సైజ్ ఫోర్డ్ సి-ఎస్యూవీని తయారు చేస్తున్నాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








