భారత్కు దిగుమతి అవుతున్న సుజుకి జిమ్నీ; త్వరలోనే మారుతి జీప్ విడుదల!
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఓ సరికొత్త జీప్ స్టయిల్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ ఆటో ఎక్స్పో ప్రదర్శనకు ఉంచిన సుజుకి జిమ్నీ ఎస్యూవీని కంపెనీ భారత్లో విడుదల చేయనుంది.

ఢిల్లీ ఆటో ఎక్స్పో 2020 మారుతి సుజుకి త్రీ-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీని ప్రదర్శనకు ఉంచింది. ఆ సమయంలో ఈ మోడల్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే, ఇండియాలో మాత్రం ఫైవ్-డోర్ వెర్షన్ మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

టీమ్-బిహెచ్పి రిపోర్ట్ ప్రకారం, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇప్పటికే సుజుకి జిమ్నీ మోడల్లో అనేక వేరియంట్లను దిగుమతి చేసుకుని, కస్టమ్స్ మరియు ఇతర క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం వేచి ఉన్నట్లు సమాచారం. ఈ మోడల్ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్ రూపంలో పూర్తి విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, ఇండియాలో అసెంబ్లింగ్ చేయనున్నారు.

సుజుకి జిమ్నీ ఎస్యూవీని భారతదేశం నుండి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయడానికి సుమారు 4,000 మరియు 5,000 యూనిట్ల ఇక్కడే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఫైవ్-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ కారులో 1.5 లీటర్ కె15 పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్పి శక్తిని, 130 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతున్న సుజుకి జిమ్నీ మోడళ్లలో సుజుకి యొక్క స్మార్ట్ప్లే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటర్నేషనల్ మోడళ్లలో లభించే ఆల్-గ్రిప్ 4 డబ్ల్యుడి సిస్టమ్ (ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్) భారతదేశంలో విక్రయించే జిమ్మీలో లభిస్తుందో లేదో వేచి చూడాలి. సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఈ ఎస్యూవీని దేశవ్యాప్తంగా మారుతి సుజుకి నెక్సా ప్రీమియం అవుట్లెట్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

మారుతి అందిస్తున్న జిప్సీ సిరీస్కు దిగువన సుజుకి జిమ్నీని ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. వచ్చే 2021లో ఈ వాహనం ఏదో ఒక సమయంలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. దేశీయ విపణిలో సుజుకి జిమ్మీ ధరలు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)లో ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక మారుతి సుజుకి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ విక్రయిస్తున్న బాలెనో మోడల్లో కొత్త ఇంజన్ను ఆప్షన్ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మోడల్ను భారత రోడ్లపై కంపెనీ టెస్ట్ చేస్తోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సుజుకి జిమ్నీ ఎస్యూవీ భారత్ రాకపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఒకవేళ ఇదే నిజమైతే, ఇంత గొప్ప వార్త మరొకటి లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఈ జీప్ స్టయిల్ సుజుకి జిమ్నీ మంచి ఆఫ్-రోడింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆటో ఎక్స్పో ద్వారా సుజుకి జిమ్మీ దేశంలో భారీ ఫాలోయింగ్ని సంపాధించుకుంది. భారత్లో ఈ మోడల్ జిప్సీ పేరుతో కాకుండా జిమ్మీ పేరుతోనే విక్రయిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం.


Click it and Unblock the Notifications








