ఫోర్డ్-మహీంద్రా జాయింట్ వెంచర్ ఎస్యూవీ ఎప్పుడొస్తుంది?
అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ 'ఫోర్డ్ మోటార్' మరియు భారత ఆటోమొబైల్ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' సంస్థలు సంయుక్తంగా కలిసి ఓ జాయింట్ వెంచర్ను ఏర్పరచిన సంగతి తెలిసినదే. ఈ మేరకు గతేడాది అక్టోబర్ నెలలో ఈ ఇరు కంపెనీలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ రెండు జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు కలిసి కట్టుగా పనిచేసి భారత ఎస్యూవీ మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాయి. ఫోర్డ్ మోటార్స్కు ఇండియన్ మార్కెట్లో ధీటైన ఎస్యూవీలను తయారు చేయటం కోసం అలాగే మహీంద్రాను అంతర్జాతీయ మార్కెట్లలో పరిచయం చేయటం కోసం ఈ జాయింట్ వెంచర్ చక్కగా ఉపయోగపడనుంది.

వాస్తవానికి ఈ రెండు కంపెనీల జాయింట్ వెంచర్కు సంబంధించిన విలీన ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావల్సి ఉంది, కాకపోతే కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వంటి అంశాల నేపథ్యంలో అది వాయిదా పడింది. ఇప్పటికే ఈ ఇరు కంపెనీలు కొత్త మోడళ్ల తయారీపై కలిసి పనిచేస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం రానున్న రెండేళ్లలో భారత మార్కెట్లో నాలుగు సరికొత్త ఎస్యూవీలను విడుదల చేసేందుకు ఫోర్డ్-మహీంద్రా బృందాలు కసరత్తులు చేస్తున్నాయి.

ఈ నాలుగు మోడళ్లలో రెండు ఫోర్డ్ బ్రాండింగ్ క్రింద మిగిలిన రెండు మహీంద్రా బ్రాండింగ్ క్రింద రానున్నట్లు సమాచారం. వీటిలో ఇరు కంపెనీలు ముందుగా ఓ పెద్ద ఎస్యూవీని విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మహీంద్రా నుంచి రాబోయే పెద్ద ఎస్యూవీ ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్యూవీ500 స్థానాన్ని భర్తీ చేయనుంది. దీనిని డబ్ల్యూ601 అనే కోడ్నేమ్తో అభివృద్ధి చేస్తున్నారు.

ఫోర్డ్ మోటార్స్ కోసం ఈ జాయింట్ వెంచర్ అభివృద్ధి చేస్తున్న పెద్ద ఎస్యూవీకి డబ్ల్యూ 605 అనే కోడ్నేమ్ పెట్టారు. ఇది ఫోర్డ్ నుంచి పూర్తిగా కొత్త మోడల్గా రానుంది. ఇక మిగిలిన రెండు కార్ల విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్యూవీకి దిగువన ఓ రెండు చిన్న కార్లను ప్రవేశపెట్టనున్నారు. మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీని ఎస్204 మరియు ఫోర్డ్ కాంపాక్ట్ ఎస్యూవీని బి745 అనే కోడ్ నేమ్తో తయారు చేయనున్నారు.

ఈ రెండు చిన్న ఎస్యూవీలు డిజైన్ పరంగా పూర్తిగా విభిన్నంగా ఉండనున్నాయి. కాకపోతే, చాస్సిస్, కాంపోనెంట్స్ విషయంలో మాత్రం ఈ రెండు మోడళ్లలో చాలా వరకూ ఒకే రంగా ఉంటాయని తెలుస్తోంది.

ఫోర్డ్-మహీంద్రా సంస్థలు తమ వాహనాల తయారీకి అయ్యే ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవాలంటే ఇరు కంపెనీలు ఒకేరకమైన ఇంజన్లను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్లు చూడటానికి విభిన్నంగా కనిపించినప్పటికీ, లోపలి భాగాలు మాత్రం చాలా వరకూ ఒకేలా ఉంటాయని తెలుస్తోంది. మహీంద్రా అందిస్తున్న 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను (163 బిహెచ్పి) ఈ కొత్త కాంపాక్ట్ కార్లలో ఉపయోగించే అవకాశం ఉంది.

మహీంద్రా ఇటీవల చేసిన ప్రకటనలో తమ నెక్స్ట్ జనరేషన్ ' మహీంద్రా ఎక్స్యూవీ500' కారును వచ్చే ఆర్థిక సంవత్సరం (2021)లో విడుదల చేస్తామని తెలిపింది. దీన్నిబట్టి చూస్తుంటే కొత్త తరం ఎక్స్యూవీ500 ఫోర్డ్ మోటార్స్ సహకారంతో సరికొత్త ప్లాట్ఫామ్పై డిజైన్ చేయనున్నట్లు అర్థమవుతోంది. ఈ కారు విడుదైలన కొద్ది రోజులకే ఫోర్డ్ మోటార్స్ నుంచి సి-సెగ్మెంట్లో ఓ సరికొత్త ఎస్యూవీ (ఎక్స్యూవీ500 ప్లాట్ఫామ్పై తయారైనది) విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే ఈ రెండు కంపెనీలు ప్లాన్ చేస్తున్న బి-సెగ్మెంట్ ఎస్యూవీలు (ఎస్204, బి745) మాత్రం మార్కెట్లోకి రావటానికి మరికొంత కాలం పట్టే ఆస్కారం ఉంది. వీటిని పూర్తిగా సరికొత్త ప్లాట్ఫామ్పై తయారు చేస్తున్న నేపథ్యంలో, ఇవి మార్కెట్లోకి రావాలంటే 2022 వరకూ వేచి ఉండాల్సి రావచ్చు.

ఫోర్డ్-మహీంద్రా కొత్త ఎస్యూవీలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశీయ, అంతర్జాతీయ కంపెనీలైన మహీంద్రా మరియు ఫోర్డ్లు సంయుక్తంగా కలిసి చేపట్టిన ఈ జాయింట్ వెంచర్లో ఇరు సంస్థలు తమ ఐడియాలను, టెక్నాలజీని షేర్ చేసుకొని అద్భుతమైన వాహనాలను మనకు అందించే అవకాశం ఉంది. ఈ ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తున్న తొలి ప్రాజెక్ట్ (సి-సెగ్మెంట్ ఎస్యూవీలు) వచ్చే ఏడాది నాటికి భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.


Click it and Unblock the Notifications








