భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయ్యే టాప్-10 కార్లు ఇవే..
ఈ ఏడాది కరోనా మహమ్మారి భారత ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రత్యేకించి, భారతదేశంలో తయారు చేయబడి, విదేశాలకు ఎగుమతి అయ్యే కార్లపై ఈ ప్రభావం అధికంగా ఉంది. కరోనా కారణంగా, అంతర్జాతీయ రవాణా స్థంభించడంతో కార్ల ఎగుమతులకు కూడా ఆటంకం కలిగింది.

అయినప్పటికీ, భారత కార్ కంపెనీలు ఈ కష్టకాలం నుండి తేరుకొని తమ ఉత్పత్తులను విదేశాలకు చేర్చగలిగాయి. గడచిన ఏప్రిల్ మరియు నవంబర్ 2020 మధ్య కాలంలో భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేసిన కార్లలో కేవలం రెండు మోడళ్లు మాత్రమే వృద్ధిని కనబరచాయి. ఈ సమయంలో భారత్ నుండి ఎగుమతి అయిన టాప్-10 కార్ల లిస్ట్ ఇలా ఉంది:

ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఫోర్డ్ ఎకోస్పోర్ట్. అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ భారత్లో ఉత్పత్తి చేస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్యూవీని కంపెనీ పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగమతి చేస్తోంది. ఏప్రిల్ - నవంబర్ 2020 మధ్య కాలంలో ఫోర్డ్ 28,047 యూనిట్లు ఎకోస్పోర్ట్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి సంఖ్య 52,897 యూనిట్లుగా ఉంది, 47 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

జనరల్ మోటార్స్ తయారు చేస్తున్న షెవర్లే బీట్ హ్యాచ్బ్యాక్ను కంపెనీ భారత్లో తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. ఏప్రిల్ - నవంబర్ 2020 మధ్య కాలంలో జిఎమ్ మొత్తం 25,814 యూనిట్లు బీట్ కార్లను ఎగుమతి చేసింది. ఏప్రిల్-నవంబర్ 2019లో వీటి సంఖ్య 50,644 యూనిట్లుగా ఉండి, 49 శాతం క్షీణతను నమోదు చేసింది. కాగా జనరల్ మోటార్స్ ఇప్పుడు భారత్లోని తమ కార్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్-10 కార్ ఎక్స్పోర్ట్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది కియా సెల్టోస్. ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఈ ఎస్యూవీ దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఏప్రిల్ - నవంబర్ 2020 మధ్య కాలంలో కియా మోటార్స్ మొత్తం 22,477 యూనిట్ల సెల్టోస్ కార్లను ఎగుమతి చేసింది.

ఇక ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది ఫోక్స్వ్యాగన్ వెంటో. ఏప్రిల్-నవంబర్ 2020లో ఫోక్స్వ్యాగన్ మొత్తం 18,608 వెంటో కార్లను ఎగుమతి చేసి, 45 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. ఇకపోతే ఐదవ స్థానంలో హ్యుందాయ్ వెర్నా ఉంది. పైన పేర్కొన్న సమయంలో హ్యుందాయ్ మొత్తం 18,487 యూనిట్ల వెర్నా కార్లను ఎగుమతి చేసి, 59 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

మారుతి సుజుకి అందిస్తున్న మైక్రో ఎస్యూవీ ఎస్-ప్రెసో 13,786 యూనిట్ల ఎగుమతులతో ఈ జాబితాలో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి అందిస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో ఉంది. ఈ సమయంలో 12,338 యూనిట్ల బాలెనో కార్లు ఎగుమతి అయ్యాయి. ఈ సమయంలో బాలెనో ఎగుమతులు 51 శాతం తగ్గాయి.

ఎనిమిదవ స్థానంలో 10,3747 యూనిట్ల ఎగుమతులతో హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటా ఉండగా, తొమ్మిదవ స్థానంలో 8,705 యూనిట్ల ఎగుమతులతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఉంది. ఈ సమయంలో వీటి ఎగుమతులు వరుసగా 63 మరియు 61 శాతం క్షీణించాయి.

జపనీస్ కార్ బ్రాండ్ భారత మార్కెట్లో నిలిపివేసిన సన్నీ సెడాన్ను అంతర్జాతీయ మార్కెట్ల కోసం మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్న నిస్సాన్ సన్నీ గడచిన ఏప్రిల్-నవంబర్ 2020 కాలంలో 7,299 యూనిట్ల ఎగుమతులను మాత్రమే నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో 39,896 యూనిట్ల సన్నీ కార్లు ఎగుమతి అయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే ఈ మోడల్ 82 శాతం భారీ క్షీణతను నమోదు చేసింది.
Source: Autopunditz


Click it and Unblock the Notifications








