ముగిసిన జనరల్ మోటార్స్ శకం; భారత్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేత!
మీకు అమెరికన్ కార్ బ్రాండ్ జనరల్ మోటార్స్ గుర్తుందా? భారతదేశంలో ఒకప్పుడు ప్యాసింజర్ కార్ల విభాగంలో ఓ వెలుగు వెలిగిన జనరల్ మోటార్స్ (జిఎమ్) ఇప్పుడు పూర్తిగా మన దేశం వదిలి వెళ్లిపోనుంది. పూణేలోని తాలేగావ్లో ఉన్న జనరల్ మోటార్స్ ప్లాంట్లో కంపెనీ తమ ఉత్పత్తి కార్యకాలాపాలను పూర్తిగా నిలిపివేసింది.

జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్యాసింజర్ కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు అప్పట్లో కంపెనీ గట్టిగానే ప్రయత్నించింది. సరికొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, వాహన కాలుష్య నిబంధనల విషయంలో కంపెనీ అవతవకలకు పాల్పడిందనే ఆరోపరణలో నేపథ్యంలో జనరల్ మోటార్స్పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ తర్వాత కంపెనీ యాజమాన్యంలో చోటు చేసుకున్న మరియు ఎదుర్కున్న పరిస్థితుల కారణంగా, జనరల్ మోటార్స్ బ్రాండ్పై భారత కస్టమర్లలో నమ్మకం సన్నగిల్లింది. వాస్తవానికి జనరల్ మోటార్స్ అద్భుతమైన వాహనాలను అందించినప్పటికీ, ఆ బ్రాండ్పై ఏర్పడిన నెగిటివ్ ఇమేజ్ కారణంగా అది మార్కెట్లో రాణించలేకపోయింది.

భారత్లో దివాళా స్థాయికి చేరుకున్న జనరల్ మోటార్స్ను స్వాధీనం చేసుకునేందుకు చైనాకి చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ (జిడబ్ల్యుఎమ్) సిద్ధమైంది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు కూడా సాగాయి. ఈ ఏడాది ప్రారంభంలో జనరల్ మోటార్స్ ప్లాంట్ను స్వాధీనం చేసుకునే గ్రేట్ వాల్ మోటార్స్ తమ ఉద్దేశాన్ని ప్రకటించింది.

అయితే, ఆ తర్వాత దేశంలో కరోనా మహమ్మారి విజృభించడం ఫలితంగా ఏర్పడిన లాక్డౌన్ వంటి పరిస్థితుల కారణంగా గ్రేట్ వాల్ మోటార్స్ ప్రణాళికలు వాయిదా పడ్డాయి. దీని తరువాత, భారతదేశం మరియు చైనా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. అప్పటి నుండి భారత్లో కొత్త చైనా పెట్టుబడులన్నీ ఆగిపోయాయి.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2021 నాటికి పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడుల విషయంలో భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎప్పటికీ ఇలానే ఉండకపోవచ్చునని, భవిష్యత్తులో పరిస్థితులు సానుకూలంగా మరుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో విదేశీ పెట్టుబడులు చాలా అవసరమని, ఈ నేపథ్యంలో భారత్ మరియు చైనా దేశాలు రెండూ కూడా ఆచరణాత్మకమైన విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయం పడుతున్నారు.
గ్రేట్ వాల్ మోటార్స్కు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే, అది మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఉపశమనం కలిగించినట్లు అవుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో గ్రేట్ వాల్ మోటార్స్ లాంటి అతిపెద్ద బ్రాండ్ తమ వ్యాపారాన్ని ప్రారంభించే రాష్ట్ర మరియు దేశ ఆర్థికాభివృద్ధి కూడా పెరిగే అవకాశం ఉంది.

కానీ, భారత్ మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కారణంగా గ్రేట్ వాల్ మోటార్స్ భారతదేశంలో తమ పెట్టుబడి ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీని కారణంగానే, జనరల్ మోటార్స్ ఇప్పుడు తమ తాలేగావ్ ప్లాంట్ను పూర్తిగా మూసివేసి, తమ స్వదేశానికి (అమెరికాకు) తిరిగి వెళ్లిపోతోంది.

తాజాగా, భారత్లో జనరల్ మోటార్స్ ప్లాంట్ మూసివేయడంతో, దేశంలో క్రమంగా మూతపడుతున్న ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లయింది. మన దేశంలో ఇప్పటికే ప్యూజో (ముంబైకి సమీపంలో ఉన్న కళ్యాణ్ వద్ద ఉన్న ప్లాంట్), డేవూ (సూరజ్పూర్ ప్లాంట్) మరియు హిందూస్తాన్ మోటార్స్ (ఉత్తరపారా ప్లాంట్, పశ్చిమ బెంగాల్) కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి.

అంతేకాకుండా, జపనీస్ కార్ బ్రాండ్ హోండా కూడా, ఇటీవలే భారత్లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేసింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన గ్రేటర్ నోయిడా ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేసి, మొత్తం ఉత్పత్తిని రాజస్థాన్ ప్లాంట్కు తరలిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసినదే.


Click it and Unblock the Notifications








