భారీగా పెరిగిన ఫోర్డ్ కార్ల ధరలు; ఏయే మోడల్పై ఎంతంటే..?
అమెరికన్ కార్ బ్రాండ్, ఫోర్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ మినహా మిగిలిన అన్ని మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ను బట్టి ఈ ధరల పెంపు రూ.35,000 వరకూ ఉంటుందని ఫోర్డ్ తెలిపింది.

ఫోర్డ్ ఇండియా, ప్రస్తుతం దేశీయ విపణిలో ఎకోస్పోర్ట్, ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎండీవర్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ ఎస్యూవీలు భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లు. ఫోర్డ్ అన్ని మోడళ్ల ధరలను పెంచుతూ, అనూహ్యంగా ఎకోస్పోర్ట్ ధరను మాత్రం తగ్గించింది. మోడల్ వారీగా ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి:

ఫోర్డ్ అందిస్తున్న పాపులర్ హ్యాచ్బ్యాక్ ఫోర్డ్ ఫిగో బేస్ వేరియంట్ (యాంబియంట్) ధరను రూ.15,000 మేర పెంచింది. అలాగే, ఇందులో టైటానియం మరియు టైటానియం బ్లూ వేరియంట్ల ధరలను వరుసగా రూ.19,000 మరియు రూ.4000 పెంచింది. అలాగే, ఇందులో ఫ్రీస్టైల్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల ధరలను రూ.5,000 మేర పెంచారు.

ఇక ఫోర్డ్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ ఆస్పైర్ విషయానికి వస్తే, కంపెనీ దీని ధరను రూ.5000 పెంచింది. ఫోర్డ్ విక్రయిస్తోన్న పెద్ద ఎస్యూవీ ఎండీవర్ ప్రస్తుతం బిఎస్6 డీజిల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, ఇందులో 4x2 ఆటోమేటిక్ వేరియంట్ మినహా మిగిలిన వేరియంట్ల ధరలను పెంచింది.

ఫోర్డ్ ఎండీవర్ ఇతర వేరియంట్ల ధరలను కంపెనీ రూ.35,000 మేర పెంచింది. ఫోర్డ్ ఎండీవర్ 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్తో లభిస్తుంది. ఈ ఎస్యూవీ టూ-వీల్ (4x2) డ్రైవ్ మరియు ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఇటీవల కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ మోడల్ను మార్కెట్లో విడుదల చేసింది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఇకపోతే, ఫోర్డ్ ఇండియా నుండి అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్లో కూడా కంపెనీ ఈ నెల ఆరంభంలో కొత్త 2021 ఫేస్లిఫ్ట్ మోడల్ను విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ .7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లగా ఉంది). మునుపటి మోడల్తో పోల్చుకుంటే దీని ధర రూ.35,000 తక్కువగా ఉంటుంది.

కొత్త 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి: యాంబియంట్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్ మరియు స్పోర్ట్స్. అన్ని వేరియంట్లను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్తో. (టైటానియం ప్లస్ కాకుండా) అందిస్తున్నారు. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.49 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఈ కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ మోడల్లో ఇప్పుడు కొత్తగా టైటానియం వేరియంట్లో సన్రూఫ్ ఫీచర్ను జోడించారు. ఇదివరకు ఈ ఫీచర్ కేవలం టాప్-ఎండ్ స్పోర్ట్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ కారు కొత్త అప్డేటెడ్ 'ఫోర్డ్పాస్' కనెక్టింగ్ టెక్నాలజీతో వస్తుంది. దీని సాయంతో యూజర్ రిమోట్గా తన కారులోని వివిధ ఫీచర్లను ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. - కొత్త ఎకోస్పోర్ట్ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కాగా, ధరల పెరుగుదలకు గల స్పష్టమైన కారణాన్ని ఫోర్డ్ ఇండియా వెల్లడించలేదు. అయితే, గతేడాది ఓ సందర్భంలో కంపెనీ ప్రస్తావించిన దాని ప్రకారం, పెరిగుతున్న ఇన్పుట్ ఖర్చులు తమ వాహనాల ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని కంపెనీ పేర్కొంది.

పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఫోర్డ్ పేర్కొంది. గతేడాది (2020)లో బుక్ చేసుకున్న కార్లను మాత్రమే పాత ధరలకే విక్రయిస్తామని, కొత్త వాహనాల బుకింగ్లకు మాత్రం కొత్త ధరలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








