మారుతి సుజుకి కస్టమర్లకు షాక్.. రూ.34,000 మేర పెరిగిన ధరలు..
భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ మార్కెట్లో తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.5000 నుండి రూ.34,000 మేర పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

కాగా, మారుతి సుజుకి బ్రాండ్ నుండి ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా వంటి పాపులర్ మోడళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇందులో మారుతి టూర్ ఎస్ అత్యల్పంగా రూ.5,061 ధరల పెరుగుదలను అందుకుంది.

మారుతి సుజుకి అరేనా షోరూమ్ నుండి విక్రయించబడుతున్న స్మాల్ కార్ ఎస్-ప్రెస్సో ధరను రూ.7000 మేర పెంచారు. కాగా, ఈ జాబితాలో అత్యధికంగా మారుతి సుజుకి స్విఫ్ట్ రూ.30,000 మరియు మారుతి సుజుకి ఎర్టిగా రూ.34,000 మేర ధరల పెంపును అందుకుంది.

ధరల పెరుగుదలను అందుకున్న ఇతర మోడళ్లలో విటారా బ్రెజ్జా, ఆల్టో, డిజైర్ మరియు వ్యాగన్ఆర్ కార్లు ఉన్నాయి. ఇందులో విటారా బ్రెజ్జా మరియు డిజైర్ ధరలు వరుసగా రూ.10,000 మరియు రూ.12500 మేర పెరిగాయి.

మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టో ధర రూ.14,000 మేర పెరిగింది. కంపెనీ అందిస్తున్న టాల్-బాయ్ హ్యాచ్బ్యాక్ వ్యాగన్ఆర్ ధర రూ.23,000 మేర పెరిగింది.

మారుతి సుజుకి 2021 ప్రారంభం నుండి తమ మోడళ్ల ధరలను పెంచుతామని గత డిసెంబరులోనే ప్రకటించిన విషయం తెలిసినదే. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా వాహనాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది.

ఇప్పటికే భారతదేశంలో కియా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచిన విషయం తెలిసినదే. తాజాగా ఈ జాబితాలోకి మారుతి సుజుకి కూడా వచ్చి చేరింది.

గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ కంపెనీలు సరైన కారణం లేకుండానే, ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభంలో తమ వాహనాల ధరలను పెంచడాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కస్టమర్లు కూడా దీనిని అలవాటు చేసుకోవటంతో ఇది మామూలు విషయంగా మారిపోయింది. ఈ ఏడాది ఇదే మొదటి మరియు చివరి ధరాఘాతం కాదు, రానున్న రోజుల్లో ఇలాంటి చాలానే చూడాల్సి వస్తుంది.

ఇక మారుతి సుజుకి బ్రాండ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అరేనా బ్రాండ్ కస్టమర్ల కోసం ఆన్లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ 'స్మార్ట్ ఫైనాన్స్'ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది.

ఇప్పుడు కస్టమర్లు షోరూమ్లను సందర్శించాల్సిన అసరం లేకుండానే రుణం తీసుకోవటానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ఆన్లైన్ ద్వారానే చేయవచ్చు. - పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








