24x7 ఎమ్జి హెల్త్లైన్ ప్రారంభం; కస్టమర్లకు ఫోన్లో ఉచిత వైద్య సలహాలు
గతేడాది భారత మార్కెట్లోకి ప్రవేశించిన కరోనా వైరస్ దాదాపుగా కనుమరుగవుతుందనే తరుణంలో, సరిగ్గా ఏడాది కాలానికి ఇది తిరగబెట్టింది. ఈసారి రెట్టింపు వేగంతో, క్షణాల వ్యవధిలో ప్రజల ప్రాణాలను హరించి వేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సాయం అందించేందుకు దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు ముందుకొస్తున్నాయి.

తాజాగా, చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్జి మోటార్, భారతదేశంలో తమ కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎమ్జి హెల్త్లైన్ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా, కోవిడ్-19తో ప్రభావితమైన తమ వినియోగదారులకు, కంపెనీ వైద్యులతో ఉచిత ఆన్లైన్ వైద్య సంప్రదింపుల సదుపాయాన్ని కల్పిస్తోంది.

ఇందుకోసం ఎమ్జి మోటార్ ఇండియా ఓ ఆన్లైన్ వేదికను సిద్ధం చేసింది. ఎమ్జి కార్లను కలిగి ఉన్న కస్టమర్లు సంస్థ యొక్క వెబ్సైట్లో కానీ లేదా తమ స్మార్ట్ఫోన్లలో మై ఎమ్జి యాప్లో కానీ తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ సేవలో భాగంగా, ఎమ్జి మోటార్ కస్టమర్లకు లేదా వారి కుటుంబ సభ్యులు ఆన్లైన్ ద్వారా, ఉత్తమమైన వైద్యులతో ఉచితంగా సంప్రదింపులు చేయవచ్చు. దేశంలో కోవిడ్-19 మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఈ చర్య తీసుకుంది.

మరోవైపు ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ల కారణంగా, ప్రజలు కూడా తమ ఇళ్ళ నుండి బయటకు రాలేక, అవసరమైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఎమ్జి మోటార్ ఇండియా ప్రారంభించిన ఎమ్జి హెల్త్లైన్ సేవలు ఆ బ్రాండ్ కస్టమర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకి కొంత మేర ఉపశమనాన్ని కల్పించనుంది.

ఎమ్జి మోటార్ ఇండియా ప్రారంభించిన ఎమ్జి హెల్త్లైన్ సేవలు 24x7 అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇందుకోసం ఎమ్జి మోటార్ కంపెనీ డాక్టర్స్ 24x7 సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా వైద్యుల సలహాలు తీసుకున్న ఎమ్జి కస్టమర్లను, సదరు వైద్య నిపుణులు మొదటి కన్సల్టేషన్ అయిన 72 గంటల తర్వాత, తిరిగి కాల్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు.

ఎమ్జి హెల్త్లైన్ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా, ఎమ్జి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ విపత్కర సమయంలో సమాజానికి తమ వంతు సేవగా, ఈ హైల్త్లైన్ సేవల ద్వారా తమ వినియోగదారులకు అవసరమైన వైద్య మద్దతును అందిస్తున్నామని అన్నారు.

ఎమ్జి మోటార్ ఇండియాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ ప్లాంట్లో వాహనాల ఉత్పత్తిని నిలిపివేసి, వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇందుకోసం కంపెనీ దేవ్నందన్ గ్యాసెస్ అనే సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలిసి ఇప్పటికే వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిని 31 శాతానికి పెంచారు.

ఈ రెండు కంపెనీలు కలిసి త్వరలో ఈ ఆక్సిజన్ ఉత్పత్తిని 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏప్రిల్ 21, 2021వ తేదీన ఎమ్జి మోటార్ ఇండియా, తమ ప్లాంట్లో పూర్తిస్థాయి ఆక్సిజన్ గ్యాస్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications








