కోవిడ్పై పోరుకు 100 హెక్టర్ అంబులెన్సులను అందించనున్న ఎమ్జి మోటార్
చైనాకి చెందిన ప్రముఖ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ హెక్టర్ ఎస్యూవీని కంపెనీ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే అంబులెన్స్గా మార్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో, ఈ ఎమ్జి హెక్టర్ అంబులెన్సులు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఎమ్జి మోటార్ ఇండియా ఇప్పటికే ఎనిమిది యూనిట్ల రెట్రోఫిటెడ్ హెక్టర్ అంబులెన్స్లను నాగ్పూర్ స్థానిక అధికారులకు అందజేసింది. మోడ్రన్ లైఫ్ సేవింగ్ సిస్టమ్స్తో ఈ హెక్టర్ అంబులెన్సులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఎమ్జి మోటార్ సంస్థ ఇలాంటివి 100 యూనిట్లను తయారు చేయనుంది.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు ఎమ్జి మోటార్ కంపెనీ వీటిని తయారు చేసింది. ఈ సంస్థ పంపిణీ చేసిన మొత్తం ఎనిమిది యూనిట్లను నాగ్పూర్ మరియు విదర్భ ప్రాంతాలలో ప్రజల ప్రయోనార్థం ఉపయోగించనున్నారు.

ఈ విషయంపై ఎమ్జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు ఎండి రాజీవ్ చాబా మాట్లాడుతూ.. "ఈ క్లిష్టమైన సమయంలో కేంద్ర మంత్రి మా మద్దతు కోసం పిలుపునిచ్చారు. వారు కోరిన 100 హెక్టర్ అంబులెన్స్ యూనిట్లలో 8 యూనిట్లను వెంటనే సిద్ధం చేశామని" ఆయన చెప్పారు.

ఈ స్పెషల్ ఎస్యూవీ అంబులెన్స్లలో మెడిసిన్ క్యాబినెట్, వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, 5 పారామీటర్ మానిటర్, ఆటో-లోడింగ్ స్ట్రెచర్, అదనపు బ్యాటరీ సాకెట్లతో కూడిన ఇన్వర్టర్, సైరన్, లైట్బార్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి.

ఈ రెట్రోఫిట్ అంబులెన్స్లను కంపెనీ ఇంజనీర్లు గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఏడాది మార్చిలో కంపెనీ నాగ్పూర్లోని నంగియా స్పెషాలిటీ ఆసుపత్రికి ఐదు యూనిట్ల రెట్రోఫిటెడ్ హెక్టర్ అంబులెన్స్లను విరాళంగా ఇచ్చింది. ఇందుకు ఎమ్జి నాగ్పూర్ డీలర్షిప్ సహకారం అందించింది.

అంతకు ముందు కంపెనీ ఇలాంటి అంబులెన్స్లను వడోదర, గుజరాత్లోని హలోల్ ఆసుపత్రులకు కూడా విరాళంగా ఇచ్చింది. కోవిడ్-19 సెకండ్ వేవ్పై పోరులో భాగంగా, కంపెనీ తమవంతు సహకారంగా తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసి, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమైంది.

ఇందుకు గానూ ఎమ్జి మోటార్ ఇండియా వడోదరకు చెందిన వాహన తయారీ సంస్థ దేవ్నందన్ గ్యాస్ సంస్థతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు కలిసి ఒక వారంలో ఆక్సిజన్ ఉత్పత్తిని 15.2 శాతం పెంచగలిగాయి. రానున్న రోజుల్లో దీనిని 50 శాతానికి పెంచాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

అంతేకాకుండా, గురుగ్రామ్లోని క్రెడిట్ హెల్త్ ద్వారా ఎమ్జి మోటార్ ఇండియా 200 పడకలను కోవిడ్-19 రోగులకు విరాళంగా ఇచ్చింది. దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ఇప్పటికే వివిధ వాహన తయారీదారులు సంస్థలు ముందుకు వచ్చి, తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్న సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








