కొత్త పేరుతో రానున్న MG ZS పెట్రోల్ ఎస్యూవీ; మూడో త్రైమాసికంలో విడుదల!
చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్జి మోటార్స్, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఎమ్జి జెడ్ఎస్ (MG ZS) పెట్రోల్ వెర్షన్ను ఈ ఏడాది తృతీయ త్రైమాసికం నాటికి భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, ఈ పెట్రోల్ వెర్షన్ ఎస్యూవీకి ఓ కొత్త పేరుని కూడా నిర్ణయించాలని కంపెనీ భావిస్తోంది.

ప్రస్తుతం ఎమ్జి మోటార్స్ విక్రయిస్తున్న హెక్టర్ ఎస్యూవీకి దిగువన ఈ కొత్త ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ ఎస్యూవీని ప్రవేసపెట్టనున్నారు. ఎమ్జి మోటార్స్ ఇప్పటికే భారత మార్కెట్లో ఎమ్జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వెర్షన్ను విక్రయిస్తోంది. కాగా, ఇందులో పెట్రోల్ వెర్షన్ను 'మోడల్ కె' అనే కోడ్నేమ్తో అభివృద్ధి చేస్తున్నారు.

ఎమ్జి మోటార్స్ ఇప్పటికే తమ పెట్రోల్ పవర్డ్ ఎమ్జి జెడ్ఎస్ ఎస్యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి భారత్లో ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెడతామని ఎమ్జి మోటార్స్ గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగానే, కంపెనీ ఇటీవలే తమ కొత్త 2021 మోడల్ హెక్టర్ను మార్కెట్లో విడుదల చేసింది.

కాగా, ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి కంపెనీ తమ సరికొత్త ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ ఎస్యూవీని ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎమ్జి మోటార్స్ నుండి హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

భారత్లో ఈ కంపెనీ తమ ఐదవ ఉత్పత్తిగా కొత్త ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ ఎస్యూవీని విడుదల చేయనుంది. కొత్త పేరుతో రానున్న ఈ ఎస్యూవీ 4.3 మీటర్ల పొడవును కలిగి ఉండి, మంచి క్యాబిన్ స్పేస్ను ఆఫర్ చేస్తుంది (హెక్టర్ పొడవు 4.6 మీటర్లు). పెట్రోల్ వెర్షన్కి ఎలక్ట్రిక్ వెర్షన్కి మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు దీని డిజైన్, ఫీచర్లలో మార్పులు ఉండొచ్చని అంచనా.

ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ ఎస్యూవీలోని ఎక్స్టీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆల్-ఎల్ఈడి ల్యాంప్స్, సన్నటి హెడ్ల్యాంప్ క్లస్టర్ మరియు స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు పియానో బ్లాక్ సైడ్ మిర్రర్స్ ఉండొచ్చని సమాచారం.

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో కొత్త డాష్బోర్డ్, 10.1 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్లాట్ బాటమ్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ ఇంజన్ మరొకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు వరుసగా 120 బిహెచ్పి, 161 బిహెచ్పి పవర్ను మరియు 150 ఎన్ఎమ్, 230 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి.

ఎమ్జి మోటార్స్ తమ జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్లో ఉపయోగించే భాగాలను స్థానికంగా సేకరిచడం ద్వారా దీని ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచాలని చూస్తోంది. గతంలో కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త పెట్రోల్ వెర్షన్ జెడ్ఎస్ ఎస్యూవీని హెక్టర్ ధర కంటే (రూ.12.83 లక్షలు) తక్కువకే అందిస్తామని తెలిపారు.

ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్యూవీ భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, రెనో డస్టర్ మరియు త్వరలో రానున్న స్కొడా కుషాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
మూలం: ఆటోకార్ ఇండియా


Click it and Unblock the Notifications








