టొయోటాపై కరోనా సెకండ్ వేవ్ పంజా; మే నెలలో భారీగా తగ్గిన కార్ సేల్స్
భారతదేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా అనేక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారతీయ ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా గడచిన మే నెలలో కార్ల అమ్మకాల వివరాలను ప్రకటించింది.

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా విడుదల చేసిన వివరాల ప్రకారం, మే 2021లో కంపెనీ మొత్తం 707 కార్లను మాత్రమే విక్రయించగలిగినట్లు తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ కారణంగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు మరియు లాక్డౌన్ల నేపథ్యంలో, గత నెలతో పోలిస్తే అమ్మకాలు భారీగా క్షీణించినట్లు కంపెనీ తెలిపింది.

టొయోటా తమ సంస్థ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుకోడానికి గడచిన ఏప్రిల్ 26 నుండి మే 14 వరకు బిడడిలోని తమ ప్లాంట్ను వార్షిక మెయింటినెన్స్ కోసం మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. గతేడాది మే (2020) నెలలో లాక్డౌన్లో సడలింపులు చేసిన తర్వాత టొయోటా మొత్తం 1,639 యూనిట్లను విక్రయించింది.

అలాగే, గడచిన ఏప్రిల్ 2021 నెలలో కంపెనీ 9,622 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. కాగా, 2021 సంవత్సరంలో మొదటి ఐదు నెలల అమ్మకాలను గమనిస్తే, టొయోటా మొత్తం 50,531 యూనిట్లును విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో మాత్రం కంపెనీ అమ్మకాలు కేవలం 24,820 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ కాలంలో టొయోటా అమ్మకాలు 104 శాతం వృద్ధిని సాధించాయి.

ఈ విషయం గురించి టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, గత నెలలో బిడడిలోని తమ ప్లాంట్లో ఉత్పత్తి జరగలేదని, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా కరోనా ఆంక్షలు మరియు లాక్డౌన్ల కారణంగా అమ్మకాలు తక్కువగా జరిగాయని అన్నారు.

కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో మే 2020 నాటి అమ్మకాలతో మే 2021 నెల అమ్మకాలను పోల్చడం తగదని ఆయన చెప్పారు. గతేడాది మే 2020లో కంపెనీ కార్యకలాపాలు మరియు అమ్మకాలు రెండింటినీ క్రమంగా పునఃప్రారంభించామని, కానీ ఏడాది ఇదే సమయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు.

దేశంలో పరిస్థితులు సద్దుమణిగాగ, లాక్డౌన్లను ఉపసంహరించిన వెంటనే ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి సాధ్యమయ్యే అన్ని చర్యలు మరియు సన్నాహాలు జరిగేలా తాము ప్రయత్నిస్తున్నామని, మార్కెట్లు పునఃప్రారంభించిన తర్వాత, కోవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని నవీన్ చెప్పారు.

టొయోటా బ్రాండ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ప్రస్తుతం ఈ కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ టొయోటా యారిస్ ఉత్పత్తిని నిలిపివేసి, దాని స్థానంలో కొత్తగా మారుతి సుజుకి సియాజ్ ఆధారిత మోడల్ను తీసుకురానున్నట్లు సమాచారం. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








