కియా కారెన్స్ కావాలా..? అయితే 75 వారాలు (దాదాపు 18 నెలలు) వేచి ఉండాల్సిందే..!
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ (Kia India), భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ మోడల్ మోడల్ కియా కారెన్స్ (Kia Carense) కోసం వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. కేవలం రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విడుదలైన ఈ ఎమ్పివి ఈ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా మరియు టొయోటా ఇన్నోవా వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తోంది. సరసమైన ధరలు, ప్రీమియం ఫీచర్లు మరియు మంచి ప్రాక్టికాలిటీ వంటి అంశాలతో ఇది కొనుగోలుదారులను మొదటి చూపులోనే కట్టి పడేస్తోంది. సమాచారం ప్రకారం, ఈ మోడల్లో కొన్ని ఎంపిక చేసిన వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ 75 వారాల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

కియా కారెన్స్ యొక్క బేస్ వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్తో లభించే ప్రీమియం మరియు ప్రెస్టీజ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ల కోసం ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ దాదాపు 74-75 వారాలు ఉన్నట్లు సమాచారం. గతంలో, మహీంద్రా నుండి వచ్చిన ఎక్స్యూవీ700 కూడా ఇదే విధమైన వెయిటింగ్ పీరియడ్ను కలిగి ఉండేది. మహీంద్రా ఎక్స్యూవీ700 లో కొన్ని వేరియంట్ల కోసం, కస్టమర్లు 20 నెలల నుండి 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు అంచనా.

కియా కారెన్స్ విషయానికి వస్తే, ఇది ఫిబ్రవరి 15, 2022న భారతదేశంలో విడుదలైంది. అప్పటి నుండి గడచిన ఏప్రిల్ 30 వరకు కంపెనీ కేవలం 12,000 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయగలిగింది. అయితే, ఈ మోడల్ కోసం డిమాండ్ మాత్రం సప్లయ్ కన్నా అధికంగా ఉంది. విడుదల సమయంలో కియా కారెన్స్ బేస్ వేరియంట్ ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటే, ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన ఆరు వారాలకే కంపెనీ ఈ వేరియంట్ ధరను రూ.9.59 లక్షలకు పెంచింది.

కియా కారెన్స్ వెయిటింగ్ పీరియడ్ కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి మారుతూ ఉంటుంది. సెమీ కండక్టర్ చిప్స్ లభ్యత కూడా కియా కారెన్స్ వెయిటింగ్ పీరియడ్ పెరగడానికి మరొక కారణంగా ఉంది. అయితే, ఈ వెయిటింగ్ పీరియడ్ ను వీలైనంత త్వరగా తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ అనంతపురం ప్లాంట్లో మూడో షిప్టులో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో, కంపెనీ దీని వెయిటింగ్ పీరియడ్ను వీలైనంత తగ్గించాలని చూస్తోంది.

కారెన్స్ ఎమ్పివి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఇవి 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటాయి. ఆకర్షణీయమైన ధర మరియు అధ్భుతమైన ఫీచర్ల కారణంగా కియా కారెన్స్ ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్లకు గొప్ప స్పందన లభిస్తోంది. అందుకే, ఈ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగా ఉంటోంది.

కియా మోటార్స్ అందిస్తున్న ఈ లేటెస్ట్ కారెన్స్ ఎమ్పివిలో 10.25 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్బి ఛార్జింగ్ పాయింట్లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే మొదలైన లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

అలాగే, ఇందులో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్లాక్ వంటి స్మార్ట్ ఫీచర్లు మరియు 6 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కియా సెల్టోస్ ఎస్యూవీలో ఉపయోగించిన అవే ఇంజన్స్ను ఈ కొత్త కియా కారెన్స్ ఎమ్పివిలో కూడా ఉపయోగించారు. ఫలితంగా, కియా తమ కారెన్స్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచాలని ప్లాన్ చేసింది. ఇందులో మొత్తం మూడు ఇంజన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి: 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇవి వివిధ రకాల గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

గత నెలలో కియా తమ కారెన్స్ ధరలను గరిష్టంగా రూ.70,000 వరకూ పెంచింది. ఈ ధరల పెంపు అనంతరం కియా కారెన్స్ బేస్ వేరియంట్ ధర రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. కియా ఇండియా తమ కారెన్స్ ఎమ్పివి ధరల పెంపుపై అధికారిక ప్రకటనను విడుదల చేయకుండానే, వెబ్సైట్లో కొత్త ధరలను అప్డేటట్ చేసింది. వెబ్సైట్లో పొందుపరచిన వివరాల ప్రకారం, Kia Carens MPV యొక్క అన్ని వేరియంట్ల ధరలు పెరిగాయి. - లేటెస్ట్ ధరల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








