అమ్మకాలు పెరుగుతున్నా ధరలు పెంచబోతున్న మహీంద్రా.. టాటా, హ్యుందాయ్లకు కలిసొచ్చేనా?
హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి బలమైన పోటీదారులను వెనక్కి నెట్టి, అమ్మకాలలో దేశంలోనే రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఎస్యూవీలను మాత్రమే విక్రయించే కంపెనీ ఇంత ఈజీగా ఈ స్టాయికి ఎలా చేరుకుందనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
అత్యుత్తమ భద్రత, ఆధునిక ఫీచర్లు, యూరోపియన్ కార్లను కూడా తలదన్నే డిజైన్ను ఒకే చోట చేర్చి వాహనాలను విడుదల చేస్తే, భారతీయులు ధరతో సంబంధం లేకుండా కొంటారని మహీంద్రా నిరూపించింది. దీనికి తోడు స్కార్పియో, బొలెరో, థార్ వంటి మోడళ్లకు ఉన్న ప్రజాదరణ కూడా తోడవడంతో మహీంద్రాకు తిరుగులేకుండా పోయింది.

2025 జూన్ నెల అమ్మకాల గణాంకాల ప్రకారం.. లాభాలు సాధించిన అతి కొద్ది వాహన తయారీ సంస్థలలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒకటి. మారుతి సుజుకి వంటి దిగ్గజ సంస్థ కూడా అమ్మకాల్లో కాస్త తడబడినప్పటికీ, మహీంద్రా మాత్రం బలమైన వృద్ధిని కొనసాగించడం విశేషం.
మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు జూన్లో అమ్మకాల్లో తగ్గుదల నమోదు చేయగా, మహీంద్రా మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారతీయ ఎస్యూవీ బ్రాండ్ 2025 జూన్లో 47,306 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్లో ఇది 40,022 యూనిట్లుగా ఉంది. XUV 3XO, థార్ రాక్స్, బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు అయిన XEV 9e, BE 6 వంటి కొత్త మోడళ్ల రాక ఇటీవలి కాలంలో అమ్మకాలను ఇంతలా నిలబెట్టడానికి సహాయపడింది. స్కార్పియో, XUV700, బొలెరో వంటి బెస్ట్ సెల్లర్లకు అదనంగా ఈ మోడల్స్ కూడా రావడంతో ప్రజలు షోరూమ్లకు పోటెత్తారు.
మహీంద్రా తన విస్తృత శ్రేణి ఎస్యూవీలు, అభివృద్ధి చెందుతున్న ఈవీ శ్రేణిని ఉపయోగించుకొని 2026 ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. అయితే, మహీంద్రా ఎస్యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్న వారికి నిరాశ కలిగించే ఒక నిర్ణయం కంపెనీ నుండి త్వరలో రాబోతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. అదేమిటంటే, తమ మొత్తం వాహన శ్రేణిలో వెలల పెంపు గురించి మహీంద్రా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తమ మొత్తం వాహన శ్రేణిలో ధరల పెంపును అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మహీంద్రా వెల్లడించింది. ద్రవ్యోల్బణం, మార్కెట్లోని ఇతర సవాళ్లను కంపెనీ నిశితంగా పరిశీలిస్తోందని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినికాంత్ గొల్లగుండ తెలిపారు. అయితే, బ్రాండ్ నుంచి తొందరపాటు నిర్ణయం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే ధరలను సవరించడానికి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సరఫరా గొలుసులోని సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా మహీంద్రా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు కంపెనీకి బలంగా ఉండాలి.

చైనా ఎగుమతి నియంత్రణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొరత వల్ల ఏర్పడే ప్రమాదాలను తగ్గించడానికి, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారులు, భాగాలను కూడా కంపెనీ పరిశీలిస్తోంది. XEV 9e, BE 6 కోసం మహీంద్రా తమ అత్యుత్తమ వేరియంట్ అయిన ప్యాక్ 3 మోడల్ 4,000 యూనిట్లను ప్రతి నెలా ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
భారతదేశంలో పండుగల సీజన్కు ముందు సరసమైన ధరలలో ప్యాక్ 1, ప్యాక్ 2 వేరియంట్లను ప్రవేశపెట్టడానికి కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా, ధరల పెంపు త్వరలోనే అమలయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే, ఎస్యూవీలను కొనాలని ప్లాన్ చేసుకున్న వారికి అది పెద్ద తలనొప్పిగా మారవచ్చు. దానికి ముందు షోరూమ్కు వెళ్లి వాహనాన్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని సాధించడం గొప్ప విషయం. అయితే, ధరల పెంపు నిర్ణయం కస్టమర్లపై భారం మోపుతుంది. ముఖ్యంగా పండుగల సీజన్కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మహీంద్రా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో, పోటీ సంస్థలైన టాటా, హ్యుందాయ్లు దీనిని ఎలా ఉపయోగించుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications








