కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ సేల్స్లో దూసుకెళ్తున్న 332 కి.మీల రేంజ్ ఈవీ.. అందరికి ఇదే కావాలి!
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ (Mg Motor) అంతర్జాతీయంగానే కాకుండా భారత్లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం లగ్జరీ ఫీచర్స్తో కూడిన కార్లను అందించడంలో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి ICE ఇంజిన్ వాహనాలను తీసుకొచ్చిన కంపెనీ కొంతవరకు విజయాన్ని సాధించినా, పూర్తి స్థాయిలో ఊహించిన స్థాయికి చేరుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఇతర తయారీదారుల నుంచి భారత్లో విపరీతమైన పోటీ ఉండటం. తర్వాత MG మోటార్ తన దృష్టిని ఎలక్ట్రిక్ వాహనాలపై మళ్లించింది. ఈవీల దిశగా అడుగులు వేసినప్పటి నుంచి కంపెనీ సేల్స్లో దూసుకుపోతుంది.
ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఈ బ్రాండ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రారంభంలో ZS EVతో ఎంట్రీ ఇచ్చిన కంపెనీ, ఆ తర్వాత కామెట్ EV, విండ్సర్ EV లాంటి విభిన్న మోడళ్లను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల్ని ఆకర్షించింది. ప్రత్యేకించి కామెట్ EV, నగరాలలో తక్కువ ఖర్చుతో ప్రయాణించే వారికి బాగా సెట్ అయింది. ప్రయాణికులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఈ కారులో ఉంటాయి.

ఈ మోడల్ చిన్న కారుగా కనిపించినా, స్మార్ట్ టెక్నాలజీ, కాంపాక్ట్ డిజైన్, ఎఫీషియెంట్ బ్యాటరీ ప్యాక్తో నగర డ్రైవింగ్కు సరైన ఎంపికగా నిలిచింది. ముఖ్యంగా మహిళలు దీనిని పెద్ద ఎత్తున ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే, MG విండ్సర్ EV రాకతో మార్కెట్లో అసలు గేమ్ మారిపోయింది. శక్తివంతమైన బ్యాటరీ, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, ప్రీమియం లుక్స్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది.
దీంతో ఈ మోడల్ తక్కువ కాలంలోనే దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఎంజీ మోటార్స్ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం, మార్చి 2025లో కంపెనీ మొత్తంగా 5,500 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2024 ఏడాది మార్చి నెలలో అమ్ముడైన 5,050 యూనిట్లతో పోలిస్తే, ఈ సారి సేల్స్ ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరగడం గమనార్హం.

అలాగే, ఫిబ్రవరి 2025లో ఎంజీ 4,002 యూనిట్లను విక్రయించగా, నెలవారీ ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 37.43 శాతం పెరిగింది. గత నెలలో జరిగిన మొత్తం 5,500 యూనిట్ల అమ్మకాల్లో 85 శాతం కంటే ఎక్కువ ఈవీలే ఉన్నాయి. ప్రధానంగా కామెట్ EV, ZS EV, విండ్సర్ EVలు అమ్మకాలు పెరగడానికి కీలకంగా దోహదం చేశాయి. ఈ మూడు ఎంజీ కస్టమర్లను ఆకర్షించడంలో బాగా సక్సెస్ అయ్యాయి.
MG విండ్సర్ కంపెనీ అత్యధిక అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉండగా, భారతదేశంలో ఎక్కువ సేల్స్ సాధించిన ఎలక్ట్రిక్ వాహనంగా కూడా గుర్తింపు పొందింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ, పోటీకి దీటైన ధరల కారణంగా ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో తిరుగులేని వాహనంగా మారింది. ప్రత్యేకించి మార్చి 2025లో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసి, MG విండ్సర్ తన డిమాండ్ను మరోసారి నిరూపించుకుంది.

ఫిబ్రవరి 2025 నాటికి ఈ మోడల్ 15,000 యూనిట్ల ప్రొడక్షన్ మైలురాయిని చేరుకుంది. అక్టోబర్ 2024 నుండి జనవరి 2025 వరకు వరుసగా నాలుగు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. డిమాండ్ పెరుగుతుండటంతో, MG తన హలోల్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. దీని ధర వచ్చేసి రూ.10 లక్షలు(ఎక్స్ షోరూమ్). దీన్ని BaaS ఆప్షన్లో కొనుగోలు చేయవచ్చు.
ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ను కావాలనుకుంటే రూ. 13.50 లక్షల నుంచి రూ. 15.50 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధర చెల్లించవచ్చు. ఇది 38 kWh బ్యాటరీ ప్యాక్లో సింగిల్ ఛార్జ్తో 332 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. కారు లోపల ఫీచర్స్ కూడా డజన్ల కొద్ది ఉన్నాయి.


Click it and Unblock the Notifications








