తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. గంటకు 14 కార్లు అమ్ముతున్న కంపెనీ.. కస్టమర్లతో కిక్కిరిసిన షోరూమ్స్
నిస్సాన్ (Nissan) కంపెనీ 2025 అక్టోబర్ నెల అమ్మకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ సంస్థ ఒక్క నెలలోనే ఏకంగా 9,675 కార్లను విక్రయించి, అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ అమ్మకాలలో అత్యధిక వాటా ఎగుమతుల నుంచే వచ్చింది. అంటే, భారతదేశంలో తయారైన నిస్సాన్ కార్లకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్లో అమ్మకాలు 45 శాతం పెరిగాయి. దీనికి కారణాలు నిస్సాన్ ఎగుమతి రికార్డు, భవిష్యత్తులో భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్న కొత్త కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
నిస్సాన్ కంపెనీ 2025 అక్టోబర్ నెలలో అమ్మకాల పరంగా బలమైన పనితీరును కనబరిచింది. నిస్సాన్ సంస్థ అక్టోబర్ నెలలో మొత్తం 9,675 కార్లను విక్రయించింది. భారతదేశంలో కేవలం 2,402 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మిగిలిన 7,273 వాహనాలను విదేశాలకు ఎగుమతి (Export) చేశారు. మొత్తం అమ్మకాలలో ఎగుమతుల వాటానే ఎక్కువగా ఉంది.

సెప్టెంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే, అక్టోబర్ నెలలో నిస్సాన్ అమ్మకాలు ఏకంగా 45 శాతం పెరిగాయి. దీనికి సెప్టెంబర్ చివర్లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ (GST) తగ్గింపు, దీపావళి పండుగ కారణాలుగా నిలిచాయి. జీఎస్టీ తగ్గింపుతో కారు ఆన్రోడ్ ధర టాప్ వేరియంట్కు రూ. లక్ష వరకు తగ్గింది.
నిస్సాన్ అమ్మకాలలో అధిక వాటా నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ఎస్యూవీదే. అయితే, గత ఏడాదితో పోలిస్తే దేశీయ అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నిస్సాన్ కంపెనీ భారతదేశంలో ఎక్కువగా మాగ్నైట్ ఎస్యూవీనే విక్రయిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో దేశీయంగా 3,121 వాహనాలు అమ్ముడవగా, ఈసారి 2,402 వాహనాలే అమ్ముడయ్యాయి. దీంతో దేశీయ అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

ఇటీవల నిస్సాన్ మాగ్నైట్లో కురో స్పెషల్ ఎడిషన్ను మెటాలిక్ గ్రే రంగులో విడుదల చేసింది. ఇది కూడా అమ్మకాలు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు. నిస్సాన్ భారతదేశంలో తయారైన కార్ల ఎగుమతిలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. నిస్సాన్ సంస్థ ఇప్పటివరకు 12 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఈ కార్లన్నీ చెన్నైలోని కామరాజర్ పోర్ట్ ద్వారా విదేశాలకు వెళ్తున్నాయి.
నిస్సాన్ ఇండియాలో తయారైన కార్లను 65 ప్రపంచ దేశాలకు (ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాలకు) ఎగుమతి చేస్తోంది. ఇందులో రైట్-హ్యాండ్ డ్రైవ్, లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ కార్లు రెండూ ఉన్నాయి. భారతీయ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి నిస్సాన్ రాబోయే రోజుల్లో కొత్త కార్లను తీసుకురావాలని ప్రణాళిక వేస్తోంది.

నిస్సాన్ త్వరలో భారతదేశంలోకి రెండు కొత్త కార్లను విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో ఒకటి 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల ఎంపీవీ (MPV) కారు, మరొకటి కాంపాక్ట్ ఎస్యూవీ (Compact SUV) ఉన్నాయి.
ఎంపీవీ కారు 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీకి నిస్సాన్ టెగ్టాన్ (Nissan Tegton) అని పేరు పెట్టారు. టెగ్టాన్తో పాటు, నిస్సాన్ 7 సీట్ల బి-ఎంపీవీ (B-MPV), 7 సీట్ల సి-ఎస్యూవీ (C-SUV) కార్లను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








