ఫార్చ్యూనర్కు పోటీ అన్నారు..మరి 5 నెలల్లో ఒక్కటి కూడా అమ్మలేదు..అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు
ప్రపంచవ్యాప్తంగా నిస్సాన్ (Nissan) కంపెనీకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. భారతదేశంలో మాత్రం మాగ్నైట్ (Magnite) ఎస్యూవీతో మళ్లీ ఊపిరి పోసుకుంది. మాగ్నైట్ సక్సెస్ తర్వాత నిస్సాన్ భారతదేశంలో మరింత బలపడాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఒకప్పుడు విఫలమైన ఎక్స్-ట్రైల్ (X-Trail) అనే భారీ ఎస్యూవీని టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner) వంటి దిగ్గజాలు ఉన్న ఫుల్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి మళ్లీ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. గత కొన్ని నెలలుగా ఎక్స్-ట్రైల్ అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ను విదేశాలలో తయారు చేసి, పూర్తిగా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా భారత్కు దిగుమతి చేసుకుంది. దీని కారణంగా ఈ ఎస్యూవీ ధర చాలా ఎక్కువగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.49.92 లక్షలు ఉండగా, టాక్స్, ఇన్సూరెన్స్ వంటివి కలిపితే ఆన్-రోడ్ ధర రూ.60 లక్షల మార్కును దాటిపోయింది.

ఫార్చ్యూనర్ వంటి బలమైన పోటీదారులతో పోలిస్తే ఈ అధిక ధర కారణంగా నిస్సాన్ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. నిస్సాన్ దీనికి దాదాపు రూ.21 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినప్పటికీ కనీసం దీన్ని కన్నెత్తి చూసిన వారే లేరు. అంటే జనాలు అసలు దీన్ని పట్టించుకోలేదు.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ విక్రయాలు లేకపోవడం సంస్థకు పెద్ద షాక్ ఇచ్చింది. తాజా రిపోర్ట్ ప్రకారం.. 2025 అక్టోబర్లో ఈ ఎస్యూవీ ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. అంతేకాదు గత ఐదు నెలలుగా అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు దీని విక్రయాలు సున్నా యూనిట్లుగా నమోదయ్యాయి. 2025 మే నెలలో చివరిసారిగా నిస్సాన్ X-ట్రైల్ యొక్క 20 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఆ తర్వాత ఒక్క కారు కూడా అమ్ముడుపోకపోవడం నిస్సాన్కు పెద్ద ఎదురుదెబ్బ. భారతదేశంలోని కస్టమర్లకు ప్రీమియం అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిస్సాన్ ఈ అధిక ధర కారణంగా ఈ మార్కెట్లో విఫలమైంది. ధర ఎక్కువ ఉన్నప్పటికీ, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ టెక్నాలజీ, ఫీచర్ల పరంగా చాలా మెరుగ్గా ఉంది.
ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, వివిధ డ్రైవింగ్ మోడ్లతో కూడిన ఫుల్-సైజ్ 7-సీటర్ ఎస్యూవీ. ఇందులో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-పాన్ పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్బ్యాగ్లు వంటి అల్ట్రా-మోడరన్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్పీ పవర్తో 300 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్లో వేరియబుల్ కంప్రెషన్ టెక్నాలజీ ఉండటం వల్ల మంచి పవర్ డెలివరీతో పాటు 13.7 కి.మీ మైలేజీ కూడా అందిస్తుంది.
ఇన్ని మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ అధిక ధర కారణంగా కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైంది. అందువల్ల నిస్సాన్ ఈ ఎస్యూవీని మార్కెట్ నుంచి త్వరలోనే నిలిపివేసే అవకాశం ఉంది. ఇకనైనా ఇండియన్ కస్టమర్లకు ఏది అవసరమో కాస్త నిస్సాన్ కంపెనీ గుర్తిస్తే బాగుంటుని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








