టయోటాకు రీబ్యాడ్జింగ్ పిచ్చి .. నిస్సాన్తో కూడా పొత్తు.. త్వరలో మార్కెట్లోకి టయోటా మాగ్నైట్
టాటా, మహీంద్రా లాంటి దేశీయ కంపెనీలతో పాటు జపనీస్ కార్ల తయారీ కంపెనీలు కూడా భారత మార్కెట్లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టయోటా(Toyota) రీబ్యాడ్జింగ్ వ్యూహంతో దూసుకుపోతోంది. మారుతి సుజుకి మోడళ్లను టయోటా బ్రాండ్తో విడుదల చేసి మంచి విజయాలు సాధించింది. ఇప్పుడు టయోటా కన్ను నిస్సాన్(Nissan) కంపెనీ మీద పడింది. ముఖ్యంగా నిస్సాన్ మాగ్నైట్(Nissan Magnite) టయోటా కుటుంబంలోకి రానుందని పుకార్లు షికారు చేస్తున్నాయి.
టయోటా ఇంతవరకు రీబ్యాడ్జ్ చేసి విడుదల చేసిన మోడల్స్ ఏవీ ఫెయిల్ అయిన చరిత్ర లేదు. అందుకే నిస్సాన్పై టయోటా దృష్టి పెట్టడంలో ఆశ్చర్యం లేదు. వాస్తవానికి నిస్సాన్, హోండా కలిసిపోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రణాళికలు మారిపోయాయి. ఆ తర్వాతే టయోటా నిస్సాన్తో చర్చలు జరిపినట్లు నివేదికలు బయటపడ్డాయి. ఈ రెండు కంపెనీలు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, త్వరలోనే టయోటా బ్రాండ్తో మాగ్నైట్ రోడ్డుపైకి వస్తుందని ఆశించవచ్చు.
ప్రస్తుతం నిస్సాన్ గ్లోబల్ స్థాయిలో ఒక రీఆర్గనైజేషన్ చేపడుతోంది. కాబట్టి టయోటాతో చేతులు కలపడానికి అవకాశం లేకపోలేదు. 2024లో ప్రకటించిన ప్రణాళికల ప్రకారం, 2027 నాటికి ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను 17 నుంచి 10కి తగ్గించి, ఉద్యోగుల సంఖ్యను కూడా 15 శాతం తగ్గించి, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. నిస్సాన్ ఎగుమతులలో భారతదేశానికి చాలా కీలక స్థానం ఉంది.

2025లో లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ మాగ్నైట్ వేరియంట్లను ప్రవేశపెట్టిన తర్వాత, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాతో సహా 100 కంటే ఎక్కువ మార్కెట్లలో మాగ్నైట్ దూసుకుపోయింది. 2023లో 50,000 యూనిట్ల నుంచి 2024లో 99,000 యూనిట్లకు ఎగుమతి పరిమాణం పెరగడం చిన్న విషయం మాత్రం కాదు. ఇది చెన్నై ప్లాంట్ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 40 శాతానికి సమానం.
నిస్సాన్ ఇండియాను వదిలివెళుతుందనే వార్తలపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మాగ్నైట్తో పాటు దేశంలో అనేక కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. కాబట్టి నిస్సాన్ కస్టమర్లు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.14 లక్షలు.
మొదట చెప్పినట్లుగా టయోటా రీబ్యాడ్జ్ చేసి విడుదల చేసిన మోడల్స్ ఏవీ ఫెయిల్ అయిన చరిత్ర లేదు. మంచి 7 సీటర్ ఎంపీవీ(MPV) కోసం షోరూంకి వచ్చే వారిని నిరాశపరచకుండా టయోటా తన షోరూంలలో మరో మోడల్ను సిద్ధం చేసింది. అదే రూమియన్ అనే మల్టీ పర్పస్ వెహికల్.
ఒకప్పుడు ఇన్నోవాకు ప్రధాన పోటీదారుగా ఉన్న మారుతి ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షనే ఈ రూమియన్. అయినప్పటికీ, టయోటా బ్యాడ్జ్తో వస్తే కొనుగోలు చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. 2025 ఏప్రిల్ నెల గణాంకాలు విడుదలైనప్పుడు టయోటా రూమియన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత నెలలో కంపెనీ 2,462 యూనిట్ల ఎంపీవీలను విక్రయించింది.
ఒక సంవత్సరం క్రితం 2024 ఏప్రిల్లో విక్రయించిన టయోటా రూమియన్ 1,192 యూనిట్లతో పోలిస్తే, ఈసారి వార్షిక అమ్మకాల వృద్ధిలో 107 శాతం పెరుగుదల సాధించింది. నెలవారీ అమ్మకాలలో కూడా రూమియన్ లాభపడింది. 2025 మార్చి నెలతో పోలిస్తే టయోటా రూమియన్ అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.
ఆ నెలలో 1,793 యూనిట్లు విక్రయించబడ్డాయి. నెలవారీ అమ్మకాలలో కూడా టయోటా 27.17 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెట్రోల్, పెట్రోల్-సీఎన్జీ బై-ఫ్యూయల్ ఆప్షన్లలో తక్కువ ధరకే లభిస్తుండడం ఈ వాహనానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్.
మారుతి ఎర్టిగాలో ఉన్న అదే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ టయోటా రూమియన్కు శక్తిని అందిస్తుంది. ఇది 102bhp పవర్తో 137Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో దీన్ని ఎంచుకోవచ్చు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మాన్యువల్ వెర్షన్ లీటర్కు 20.11 కిలోమీటర్లు, పెట్రోల్ ఆటోమాటిక్ 20.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
టయోటా రీబ్యాడ్జింగ్ వ్యూహం భారత మార్కెట్లో విజయవంతంగా కొనసాగుతోంది. రూమియన్ అమ్మకాల వృద్ధి దీనికి నిదర్శనం. నిస్సాన్ మాగ్నైట్ టయోటా బ్యాడ్జ్తో వస్తే, అది టయోటాకు మరో పెద్ద విజయాన్ని అందిస్తుంది. నిస్సాన్ తన గ్లోబల్ పునర్నిర్మాణ ప్లాన్లతో పాటు, ఇండియాలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా తన ఉనికిని పదిలం చేసుకోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రెండు జపనీస్ దిగ్గజాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications








