టాటా, హ్యుందాయ్ కథ కంచికి..ఇక మహీంద్రాదే హవా.. రెండో స్థానానికి చేరిన ఎస్యూవీ కింగ్
భారత ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనం నమోదైంది. గత దశాబ్ద కాలంగా మారుతి సుజుకి తర్వాత రెండో స్థానం కోసం టాటా మోటార్స్, హ్యుందాయ్ మధ్యే హోరాహోరీ పోరు సాగేది. కానీ 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే సమయానికి అసలు ఊహించని విధంగా దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) రెండో స్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. హ్యుందాయ్, టాటాలకు భారీ షాక్ ఇస్తూ మహీంద్రా సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎస్యూవీల ప్రభంజనం - మహీంద్రా జైత్రయాత్ర
2025 ఏడాది భారత కార్ల మార్కెట్లో ఒక మలుపు లాంటిది. సాధారణంగా హ్యాచ్బ్యాక్ కార్ల హవా ఉండే మన దేశంలో, ఇప్పుడు జనం చూపు ఎస్యూవీల (SUV) వైపు మళ్లింది. దీనిని మహీంద్రా పక్కాగా క్యాష్ చేసుకుంది. గతేడాది మహీంద్రా మొత్తం 5.94 లక్షల యూనిట్ల విక్రయాలను (Vahan రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం) నమోదు చేసింది.

2024తో పోలిస్తే ఇది ఏకంగా 21 శాతం వృద్ధి. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్, ఎక్స్యూవీ 700, థార్, కొత్తగా వచ్చిన థార్ రాక్స్ (Thar Roxx) మోడళ్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా థార్ బ్రాండ్ విక్రయాలు లక్ష దాటడం గమనార్హం.
టాటా, హ్యుందాయ్లకు ఎందుకు దెబ్బ పడింది?
ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో పాతుకుపోయిన హ్యుందాయ్, ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. హ్యుందాయ్ 2025లో సుమారు 5.57 లక్షల కార్లను విక్రయించగా, టాటా మోటార్స్ 5.51 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా మినహా మిగిలిన మోడళ్లలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, టాటా మోటార్స్ ఈవీ(EV) రంగంలో లీడర్గా ఉన్నప్పటికీ పెట్రోల్/డీజిల్ వేరియంట్లలో మహీంద్రా దూకుడును తట్టుకోలేకపోవడం ఈ మార్పుకు కారణం. పైగా మహీంద్రా తన ఎస్యూవీ పోర్ట్ఫోలియోను కేవలం పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా బలంగా తీసుకెళ్లగలిగింది.
GST 2.0 - మహీంద్రాకు అదనపు బలం
సెప్టెంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన GST 2.0 మార్పులు మహీంద్రాకు కొండంత అండగా నిలిచాయి. హైబ్రిడ్, ఎస్యూవీ కార్లపై పన్ను భార తగ్గేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మహీంద్రా తన కార్ల ధరలను రూ. 1.50 లక్షల వరకు తగ్గించగలిగింది.

తక్కువ ధరకే పెద్ద కార్లు వస్తుండటంతో సామాన్యులు సైతం మహీంద్రా షోరూమ్ల వైపు క్యూ కట్టారు. ముఖ్యంగా బోలెరో, స్కార్పియో వంటి మోడళ్లకు పల్లెల్లో ఉన్న క్రేజ్ ఈ సంస్థను రెండో స్థానంలో నిలబెట్టింది.
మారుతి సుజుకి అప్రతిహత విజయం
ఎన్ని మార్పులు జరిగినా నంబర్ 1 స్థానం మాత్రం ఎప్పటిలాగే మారుతి సుజుకి వశమైంది. 2025లో మారుతి ఏకంగా 18.44 లక్షల పైగా వాహనాలను విక్రయించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

స్విఫ్ట్, డిజైర్, బాలెనో వంటి హ్యాచ్బ్యాక్లతో పాటు బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి ఎస్యూవీలు కూడా మారుతికి భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే, రెండో స్థానం కోసం జరిగిన పోరులో మాత్రం విదేశీ కంపెనీలను తోసిరాజని భారతీయ కంపెనీలు (మహీంద్రా, టాటా) టాప్ 3లో నిలవడం భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణం.


Click it and Unblock the Notifications








