పొలం పనులకైనా, పట్నం పనులకైనా దీని తర్వాతే ఇంకేదైనా.. విదేశీయులు కూడా ఈ కారే కావాలంటున్నారు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ విపణిలోనూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఇండోనేషియా ప్రభుత్వ సంస్థ నుంచి ఏకంగా 35,000 మహీంద్రా స్కార్పియో పిక్-అప్ ట్రక్కుల కోసం భారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇది మహీంద్రా చరిత్రలోనే అతిపెద్ద ఎగుమతి ఆర్డర్ కావడం విశేషం. భారతీయ తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఒప్పందం ప్రపంచానికి చాటిచెబుతోంది.
భారతదేశంలో మహీంద్రా స్కార్పియోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు లగ్జరీ ఎస్యూవీగా, అటు కమర్షియల్ వాహనంగా స్కార్పియో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇప్పుడు అదే మ్యాజిక్ ఇండోనేషియాలోనూ రిపీట్ కాబోతోంది. ఇండోనేషియాకు చెందిన ప్రభుత్వ సంస్థ అగ్రీనాస్ పంగన్ నుసంతార తన ప్రతిష్టాత్మక కోపెరాసి దేసా/కెలురహన్ మెరా పుడిత్(KDKMP) ప్రాజెక్ట్ కోసం మహీంద్రాను ఎంచుకుంది. 2026 నాటికి మొత్తం 35,000 స్కార్పియో పిక్-అప్ సింగిల్ క్యాబ్ వాహనాలను సరఫరా చేయాలని మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది.

దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి..
సాధారణంగా ఇండోనేషియా వంటి దేశాల్లో జపాన్ కార్ల కంపెనీలైన టయోటా, మిత్సుబిషి, ఇసుజు, సుజుకి వంటి వాటికి బలమైన పట్టు ఉంటుంది. అక్కడ పిక్-అప్ ట్రక్కుల మార్కెట్ చాలా పెద్దది. ఇన్ని దిగ్గజ కంపెనీలు మార్కెట్లో ఉన్నప్పటికీ, ఆ దేశ ప్రభుత్వ సంస్థ మహీంద్రా వైపు మొగ్గు చూపడం గమనార్హం. భారతీయ వాహనాల్లో ఉండే దృఢత్వం, తక్కువ మెయింటెనెన్స్, శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లే మహీంద్రాను గెలిపించాయి. ఈ భారీ ఆర్డర్ ద్వారా మహీంద్రా తన అంతర్జాతీయ స్థాయిని మరో మెట్టు ఎక్కించుకుంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహీంద్రా ఇంజిన్!
ఇండోనేషియా ప్రభుత్వం చేపట్టిన ఈ KDKMP ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడం. సహకార సంఘాల అభివృద్ధికి ఈ వాహనాలను ఉపయోగించనున్నారు. రైతులు పండించిన తాజా పంటను మార్కెట్లకు వేగంగా తరలించడానికి, గ్రామీణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి స్కార్పియో పిక్-అప్ వాహనాలు కీలకం కానున్నాయి. స్కార్పియో పిక్-అప్ సింగిల్ క్యాబ్ అనేది అత్యంత కఠినమైన రోడ్లపై కూడా భారీ లోడ్ను మోసుకెళ్లగలదు. అందుకే ఇండోనేషియా భౌగోళిక పరిస్థితులకు ఇది సరిగ్గా సరిపోతుందని ఆ దేశ నిపుణులు భావిస్తున్నారు.

మహీంద్రా ఎగుమతుల్లో నవ శకం
ఈ 35,000 వాహనాల ఆర్డర్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ సరిపోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా మొత్తం ఎగుమతి చేసిన వాహనాల సంఖ్య కంటే ఈ ఒక్క ఆర్డర్ విలువ చాలా ఎక్కువ. అంటే కంపెనీ వార్షిక ఎగుమతి సామర్థ్యాన్ని ఇది ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. ఇది కేవలం మహీంద్రాకే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకురానుంది.
తయారీ అంతా నాసిక్ ప్లాంట్లోనే
ఈ భారీ ఆర్డర్ను పూర్తి చేయడానికి మహీంద్రా తన నాసిక్ ప్లాంట్ను సిద్ధం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఈ 35,000 యూనిట్లను ఇక్కడే తయారు చేయనున్నారు. 2026 నాటికి విడతల వారీగా ఈ వాహనాలను ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నారు. నాసిక్ ప్లాంట్ ఇప్పటికే స్కార్పియో తయారీకి పెట్టింది పేరు, ఇప్పుడు ఈ అంతర్జాతీయ ఆర్డర్ వల్ల అక్కడ స్థానిక ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








