50 వేల బుకింగ్స్తో దూసుకెళ్తున్న ఎంజీ హెక్టార్
చైనా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ మోటార్స్ భారతదేశపు తొలి ఇంటర్నెట్ కారుగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ ఎంజీ హెక్టార్ మీద ఇప్పటి వరకూ 50,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది మరియు 20 వేల హెక్టార్ ఎస్యూవీలు విక్రయించినట్లు ఎంజీ ప్రకటించింది.

బుకింగ్స్ ప్రారంభించిన తొలి 23 రోజుల్లో 10,000 బుకింగ్స్ నమోదు చేసుకోగా, తొలి 45 రోజుల్లో 21,000 ఆర్డర్లు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ఎంజీ హెక్టార్ మీద ఎలాంటి బుకింగ్స్ స్వీకరించడం లేదు. ఇది వరకే బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకు తాత్కాలికంగా బుకింగ్స్ నిలిపేసినట్లు తెలిసింది.

ఎంజీ హెక్టార్ సక్సెస్ గురించి ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, "ఎంజీ మోటార్స్ విడుదల చేసిన మొట్టమొదటి మోడల్ ఎంజీ హెక్టార్ ఇండియన్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. హెక్టార్ హవా ఇంకా కొన్నాళ్లపాటు నడిచే అవకాశం ఉంది, అతి త్వరలో 6-సీటర్ ఎంజీ హెక్టార్ ప్లస్ వేరియంట్ తీసుకొస్తున్నాము. అన్ని ప్రధాన నగరాల్లో మరిన్ని ఎంజీ షోరూములు ప్రారంభిస్తామని" చెప్పుకొచ్చారు.

మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటి వరకూ పరిచయం కాని ఎన్నో ఫీచర్లను ఎంజీ హెక్టార్ ద్వారా ఇండియన్స్కి పరిచయం చేశారు. సుమారుగా 50 రకాల కనెక్టివిటీ ఫీచర్లు గల ఐస్మార్ట్ కార్ కనెక్ట్ సిస్టమ్ అందించారు.

జియో ఫెన్సింగ్, వెహికల్ థెఫ్ట్ ట్రాకింగ్ మరియు ఇమ్మొబిలైజర్, రిమోట్ వెహికల్ కంట్రోల్, రూఫ్ మీద ఏసీ వెంట్స్, సన్రూఫ్, టెయిల్ గేట్ ఓపెన్/క్లోజ్ ఫంక్షన్స్ మరియు వాయిస్ కమాండ్ వంటి ఎన్నో ఫీచర్లను మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

లగ్జరీ ఫీలింగ్ కల్పించే ఇంటీరియర్లో ఫాక్స్ లెథర్ అప్హోల్స్ట్రే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే సపోర్ట్ గల 10.1-ఇంచుల పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎక్ట్సీరియర్లో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఇంకా ఎన్నో హైలెట్స్ ఉన్నాయి.

సాంకేతికంగా ఎంజీ హెక్టార్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. 2.0-లీటర్ డీజల్ ఇంజన్, 15-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ కోసం డీసీటీ ఆటోమేటిక్ గేర్బాక్స్ అందుబాటులో ఉంది.

భారతదేశపు తొలి ఇంటర్నెట్ ఎస్యూవీ ఎంజీ హెక్టార్ ధరల శ్రేణి రూ. 12.74 లక్షల నుండి రూ. 17.44 మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 13కిమీ మరియు డీజల్ వేరియంట్ మైలేజ్ 17కిలోమీటర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








