ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు 'స్విచ్ ఢిల్లీ' క్యాంపైన్ను ప్రారంభించిన సీఎం
దేశ రాజధానిలో పెచ్చుమీరుతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు అక్కడి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రోత్సహించేందుకు గాను 'స్విచ్ ఢిల్లీ' పేరిట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 4న ఓ ప్రచారాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించిన కేజ్రీవాల్, ప్రజలందరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఆరు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాల కోసం కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

దేశ రాజధానిలో వచ్చే 2024 నాటికి కనీసం 25 శాతం వాహనాలను విద్యుత్తుతో నడిపించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం తమ ఎలక్ట్రిక్ వాహన విధానంలో భాగంగా, రహదారి పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించడంతో పాటు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల కొనుగోలుపై విస్తృతమైన రాయితీలను ప్లాన్ చేసింది.

అంతేకాకుండా, డెలివరీ చైన్స్, పెద్ద కంపెనీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, మార్కెట్ అసోసియేషన్లు, షాపింగ్ మాల్స్ మరియు సినిమా హాల్స్ వంటి పబ్లిక్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయటం, వారి ప్రాంగణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరారు.

యవత తమ మొదటి వాహనంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యవతను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. కాలుష్యాన్ని కలిగించే పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేసి, కాలుష్య రహిత రాజధానికి దోహదం చేసే ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు. "స్విచ్ ఢిల్లీ" ప్రచారాన్ని ఓ ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని ఆయన అన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం తమ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి 2020 ఆగస్టులో ఓ నోటిఫికేషన్ను కూడా జారీ చేసింది.

పర్యావరణ అనుకూల ఇంధనంతో నడుస్తున్న ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షా మరియు సరుకు రవాణా వాహనాల కోసం, బ్యాటరీ సామర్థ్యంలో కిలోవాట్కు రూ.5,000 సబ్సిడీ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 2020లో, బ్యాటరీతో నడిచే వాహనాలపై రహదారి పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుపై పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేసింది.

ఈవీ ప్రయోజనాల క్రింద మొదటి 1,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లకు కిలోవాట్కు రూ.10,000 రాయితీని ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనంపై గరిష్టంగా రూ.1.50 లక్షలు సబ్సిడీని ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రక్ ద్విచక్ర వాహనం, త్రీ వీలర్, ఫ్లీట్, కొరియర్ వాహనాలపై గరిష్టంగా రూ.30,000 సబ్సిడీని ప్రకటించారు.

ఢిల్లీ సర్కారు 2020 ఆగస్టులో ఈవీ పాలసీని ప్రకటించినప్పటి నుండి, ఆ రాష్ట్రంలో 6,000 ఎలక్ట్రిక్ వాహనాలను కస్టమర్లు కొనుగోలు చేశారని, ఢిల్లీ వ్యాప్తంగా 100 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం టెండర్లను కూడా జారీ చేసిందని కేజ్రీవాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








