ఈ బడ్జెట్లోనైనా మాకు గుడ్ న్యూస్ చెప్పండి: ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు
నేటి (జనవరి 29, 2021) నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అన్ని రంగాల చూపు, ఇప్పుడు కేంద్రం వైపే ఉంది. ప్రత్యేకించి భారత ఆటోమొబైల్ రంగం, ఈసారి బడ్జెట్పై అత్యధిక అంచనాను పెట్టుకుంది.

ఇటీవలి కాలంలో పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు మరియు కఠినమైన బిఎస్-6 ప్రమాణాల కారణంగా భారత ఆటోమొబైల్ రంగం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కుంది. ఈ పరిస్థితుల్లో, ఆటో రంగాన్ని ఆదుకునేందుకు బడ్జెట్ 2021లో కేంద్రం తమకు వరాలను ఇవ్వొచ్చని తయారీదారులు ఆశాభావంతో ఉన్నారు.

ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్ వాహనాలతో పాటీగా, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గట్టిగా ప్రోత్సహించేలా, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల కోసం కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేక రాయితీలను ప్రసాదించే సూచనలు కనిపిస్తున్నాయి.

అదే గనుక జరిగితే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగొచ్చి, సామాన్యులకు సైతం అందుబాటులో వస్తాయి. అంతేకాకుండా, ఈ ప్రోత్సాహకాల వలన మరిన్ని కొత్త కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరగాలి.

దేశంలో ఇప్పటికే టాటా మోటార్స్, ఎమ్జి మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ వంటి కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి. ఇటీవలే అమెరికన్ కార్ మేకర్ టెస్లా కూడా భారత్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు ద్విచక్ర వాహన విభాగంలో ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్ ఇప్పటికే మార్కెట్ లీడర్గా ఉంటే, టీవీఎస్, బజాజ్ ఆటో సంస్థలతో పాటుగా అనేక కొత్త కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి.

ఈసారి బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగానికి కేంద్రం ప్రత్యేక రాయితీలను, ప్రయోజనాలను కేటాయించినట్లయితే, రానున్న రోజుల్లో దేశంలో ఈ రకం వాహనాల వ్యాపారం మరియు వినియోగం జోరందుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఈ 2021 బడ్జెట్లో వాహన స్క్రాప్ విధానం గురించి కూడా ప్రస్థావించే అవకాశం ఉంది. పర్యావరణానికి హాని కలిగించే పాత వాహనాలకు స్వస్తి చెప్పేందుకు స్క్రాప్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటుగా గ్రీన్ టాక్స్ను అమలు చేసే విషయాలను కూడా ఈ సందర్భంగా చర్చకు తీసుకునే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే పరికరాలు, ముడి పదార్థాలపై జిఎస్టిని కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ అభిప్రాయపడింది.

దేశంలో కొత్త కంపెనీలు వృద్ధి చెందడానికి మరియు విస్తరించడానికి వీలుగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టుబడి విధానాన్ని సరళతరం చేయాలని టొయోటా భావించింది. అంతేకాకుండా, విదేశాల నుండి దిగుమతి చేసుకునే వాహనాలపై పన్ను కూడా తగ్గించాలని టొయోటా సూచించింది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు వీలుగా, కస్టమర్లకు వీటి విషయంలో ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుందని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే మరో సంస్థ గ్రీవ్స్ మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు మరియు భవిష్యత్తులో వాటి ఆశ్యకత గురించి ప్రభుత్వం ప్రజలతో చర్చించాలని అభిప్రాయపడింది.

ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాల గురించి అనేక అపోహలు ఉన్నాయని, చాలా మంది వీటిని అంత విశ్వసనీయమైనవి కావని భావిస్తున్నారని, వారిలో ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఇలాంటి వాహనాలను తయారు చేసే కంపెనీలు కేంద్రాన్ని కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications








