లండన్లో ఓలా క్యాబ్స్ ఏం చేస్తున్నాయో చూడండి..
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా క్యాబ్స్, ఇప్పుడు లండన్లో ఓ కొత్త రకం సేవలను ప్రారంభించాయి. ఓలా క్యాబ్స్ ఇప్పుడు లండన్లో ఎలక్ట్రిక్ క్యాబ్స్ను ప్రవేశపెట్టింది. ఇందు కోసం ఓలా మొబైల్ యాప్లో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని కూడా చేర్చారు.

లండన్లోని వినియోగదారులు ఈ యాప్ సాయంతో ఎలక్ట్రిక్ క్యాబ్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. లండన్లో ఇప్పటి వరకూ సాధారణ క్యాబ్ సేవలను అందించిన ఓలా, తొలిసారిగా ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. రానున్న రోజుల్లో కంపెనీ ఇతర నగరాల్లో కూడా ఎలక్ట్రిక్ క్యాబ్లను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలో, రైడర్ల సౌకర్యం ప్రకారం క్యాబ్లను ఎంచుకునే అవకాశం ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇలా రైడర్ ఎంచుకునే ఎలక్ట్రిక్ క్యాబ్ వర్గం ప్రకారం ఛార్జీలు వసూలు చేయబడతాయని ఓలా వివరించింది.

లండన్లో ఎలక్ట్రిక్ క్యాబ్లను ప్రారంభించాలనే నిర్ణయం, ఆ దేశంలో జీరో-ఎమిషన్ చొరవ అయిన గ్రీన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్పై తమ నిబద్ధతకు మొదటి అడుగు అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ క్యాబ్ ప్లాట్ఫామ్కు కొత్త డ్రైవర్లను చేర్చాలని ఓలా యోచిస్తోంది.

ఇందుకోసం లండన్లో ఎలక్ట్రిక్ క్యాబ్ల కోసం శిక్షణ పొందిన 700 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్లో స్థానిక డ్రైవర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఓలా నివేదించింది.

ఓలా తమ కొత్త క్యాబ్ డ్రైవర్ల కోసం ఆకర్షణీయమైన పథకాలను కూడా ప్రవేశపెట్టింది, ఇది వారికి మంచి ఆదాయ ఎంపికను ఇస్తుంది. ఇలాంటి వాహనాలను నడిపే కొత్త డ్రైవర్ల నుండి మొదటి మూడు నెలలు కంపెనీ సున్నా శాతం కమీషన్ వసూలు చేస్తుంది. ఈ ప్రణాళిక ఊబర్కు గట్టి సవాలుగా విసురుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ విషయంపై ఓలా యూకె మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ రోసెండల్ మాట్లాడుతూ, "ఓలా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తోంది. వినియోగదారులు ఓలా యొక్క కొత్త ఎలక్ట్రిక్ క్యాబ్లను సాధారణ క్యాబ్ ఫీజు కోసం బుక్ చేసుకోవచ్చు. లండన్ వెలుపల ఉన్న ఇతర నగరాలకు ఈ ఎలక్ట్రిక్ క్యాబ్లు రవాణా సదుపాయాలను అందించగలవు.

ఇదిలా ఉంటే, భారతదేశలో ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. తమిళనాడులోని హోసూర్ ప్రాంతంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీ ఓ భారీ టూవీలర్ ప్లాంట్ను స్థాపిస్తోంది. ఈ ప్లాంట్లో ప్రతి సంవత్సరం 1 కోటి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది.

ఈ సంవత్సరం వేసవి కాలం నాటికి ఫ్యాక్టరీ యొక్క మొదటి దశ సిద్ధంగా ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి ప్లాంట్ మొత్తం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఓలా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓ హైపర్ఛార్జ్ నెట్వర్క్ను కూడా నిర్మిస్తోంది. దీని సాయంతో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలను కంపెనీ అందించనుంది.


Click it and Unblock the Notifications








