1500 పైగా అడ్వాన్స్డ్ రోబోలు.. 98 శాతం ఆటోమేషన్.. చకన్ ప్లాంట్ నుంచి మహీంద్రా 30 లక్షలవ కారు రిలీజ్
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన తయారీ రంగంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న కంపెనీ ప్రసిద్ధ చకన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి ఏకంగా 30 లక్షలవ వాహనం విజయవంతంగా బయటకు వచ్చింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంలో మైలురాయి వాహనంగా మహీంద్రా కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన BE 06 నిలిచింది.
ప్లాంట్ నుంచి 30 లక్షలవ కారుగా ఈ ఈవీ మోడల్ రోల్ అవుట్ కావడం విశేషం. ఈ ప్లాంట్ను కంపెనీ అటు సాంప్రదాయ ఇంధన (ICE) వాహనాలు, ఇటు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటి తయారీకి సమానంగా ఉపయోగిస్తోంది. మహీంద్రా చకన్ ప్లాంట్ ప్రయాణంలో కార్ల ఉత్పత్తి వేగం గణనీయంగా పెరిగింది. ఈ ప్లాంట్ ప్రారంభించిన తర్వాత మొదటి 10 లక్షల వాహనాలను తయారు చేయడానికి కంపెనీకి ఏకంగా 107 నెలల సమయం పట్టింది.

కానీ మార్కెట్లో మహీంద్రా కార్లకు పెరిగిన విపరీతమైన డిమాండ్ కారణంగా.. చివరి 10 లక్షల వాహనాలు కేవలం 27 నెలల స్వల్ప వ్యవధిలోనే ఉత్పత్తి అయ్యాయి. అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం నాలుగు రెట్లు వేగంగా వాహనాల ప్రొడక్షన్ జరుగుతోంది. గత రెండేళ్లలో మహీంద్రా ఎస్యూవీలు, ఎలక్ట్రిక్ కార్లకు దేశీయంగా ఎంతటి ఆదరణ పెరిగిందో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చకన్ ప్లాంట్లో కమర్షియల్ ట్రక్కులు, ఈవీలు, ఎస్యూవీలతో కలిపి మొత్తం 19 మోడళ్లు, 450 కి పైగా వేరియంట్లను సంస్థ తయారు చేస్తోంది. చకన్ ప్లాంట్ కేవలం భారతదేశ అవసరాలనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్ను కూడా తీరుస్తోంది. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి పలు విదేశీ మార్కెట్లకు మహీంద్రా ఎస్యూవీలు, పికప్ ట్రక్కులు భారీగా ఎగుమతి అవుతున్నాయి.
వరల్డ్ క్లాస్ క్వాలిటీ, వినూత్నమైన డిజైన్లు, ప్రీమియం రైడింగ్ ఎక్స్పీరియన్స్, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అంతర్జాతీయంగా మహీంద్రా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ సాధించిన విజయంపై మహీంద్రా ఆటోమోటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ ఆర్.వేలుస్వామి హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ వేగవంతమైన వృద్ధి మా కస్టమర్ల నమ్మకానికి, మా ఉద్యోగులు, సప్లయర్ల నిరంతర కృషికి నిదర్శనమని కొనియాడారు.

ఈ స్థాయి భారీ డిమాండ్ను తట్టుకుని, కస్టమర్లకు సకాలంలో వాహనాలను డెలివరీ చేయడం కోసం మహీంద్రా కంపెనీ చకన్ ప్లాంట్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇండస్ట్రీ 4.0 ప్రమాణాలతో ఈ ప్లాంట్ను సరికొత్త సాంకేతిక కేంద్రంగా మార్చింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), సూపర్ ఫాస్ట్ 5G కనెక్టివిటీ, డిజిటల్ ట్రేసబిలిటీ వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.
ఇవి కారు తయారీలో ఎలాంటి లోపాలు లేకుండా వరల్ట్ క్లాస్ క్వాలిటీ వచ్చేలా చూస్తాయి. ప్రీమియం ఎస్యూవీ విభాగంలో టాప్ పొజిషన్లో ఉన్న మహీంద్రా.. తన అప్కమింగ్ బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్ లోని BE 06, XEV 9e, XEV 9s మోడళ్లతో ఈవీ మార్కెట్ను కూడా శాసించాలని చూస్తోంది.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చకన్ ప్లాంట్ లోని బాడీ షాప్ లో దాదాపు 98 శాతం పనిని ఆటోమేషన్ చేశారు. దీని కోసం 1,500 కంటే ఎక్కువ అత్యాధునిక రోబోలను రంగంలోకి దించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈవీల తయారీకి 100 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని వాడుతున్నారు.
ఈ అధునాతన మార్పుల వల్ల ప్రొడక్షన్ చాలా వేగవంతం కావడమే కాకుండా, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతుందని సంస్థ స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మహీంద్రా అమ్మకాల్లో సరికొత్త రికార్డు వృద్ధిని నమోదు చేయడంలో ఈ చకన్ ప్లాంట్ కీలక పాత్ర పోషించిందని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications