టాటా మోటార్స్కు మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్
మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.
భారతదేశపు అతి పెద్ద విభిన్న వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, తమ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం జోరు పెంచింది. దేశీయ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ 2019 నాటికి విపణిలోకి రెండు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఈ రెండు మోడళ్లకు చెందిన వివరాలను వెల్లడించలేదు. అయితే, పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు మోటార్ల పరంగా మరో నూతన భాగస్వామ్యంతో చేతులు కలిపి కొత్త ఉత్పత్తుల మీద దృష్టిసారించింది.

దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఏకైక సంస్థ మహీంద్రా, ప్రస్తుతం విపణిలో ఇ-వెరిటో, ఇ2ఒ ప్లస్ మరియు ఇ-సుప్రో వంటి వాహనాలను విభిన్న కెటిగరీలో అందుబాటులో ఉంచింది.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ," రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేస్తున్నాము. వీటిలో మొదటి మోడల్ను 2018 చివరి నాటికి మరియు రెండవ మోడల్ను 2019 మధ్య భాగానికి విడుదల చేస్తామని" తెలిపాడు.

రానున్న రెండు మూడేళ్లలో విద్యుత్ వాహనాల అభివృద్ది మరియు తయారీ కోసం సుమారుగా 600 కోట్లు రుపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇదే బడ్జెట్ క్రింద ప్రస్తుతం ఒక్కో నెలకు ఉన్న 500 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 5,000 యూనిట్లకు పెంచనుంది. అదే విధంగా కొత్త సాంకేతిక టెక్నాలజీ మరియు బ్యాటరీ పరికరాల అభివృద్దికి ఖర్చు పెట్టనుంది.

గోయెంకా మాట్లాడుతూ, "గత మూడు-నాలుగేళ్ల నుండి ఇప్పటికే 500 కోట్ల రుపాయలకు పైగా పెట్టుబడి పెట్టాము. రానున్న రెండు మూడేళ్ల కోసం మరో 6,00 కోట్ల రుపాయల పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
అభివృద్ది చెందుతున్న దేశాల సరసన ఉన్న భారత్లో ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల వినియోగం అంతంత మాత్రమే ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజా రవాణాలో జరగాల్సిన కీలకమైన మార్పులు ఏవైనా ఉన్నాయా అంటే, అది పెట్రోల్ మరియు డీజల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకోవడం.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో, మహీంద్రా మినహాయిస్తే మరే సంస్థ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం లేదు. అయితే కొన్ని సంవత్సరాల నుండి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మంచి అనుభవం ఉన్న మహీంద్రా ప్రత్యర్థి సంస్థ టాటా నుండి తాజాగా ప్రభుత్వం రంగ సంస్థ ఇఇఎస్ఎల్ నిర్వహించిన ఎలక్ట్రిక్ కార్ల వేలాన్ని దక్కించుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల విపణిలో పట్టును పెంచుకునేందుకు మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం సిద్దమైంది.


Click it and Unblock the Notifications








