కాలుష్య నిర్మూలనలో నూతన ఒరవడిని సృష్టించిన ఎలక్ట్రిక్ వెహికల్స్: ఏపిలో తయారీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా జరిగిన హ్యాపి సిటీస్ సమ్మిట్ 2018లో ఎలక్ట్రిక్ వాహనాల గురించిన చర్చలు మరియు సదస్సులో ఆవిష్కరించిన పలు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా జరిగిన హ్యాపి సిటీస్ సమ్మిట్ 2018లో ఎలక్ట్రిక్ వాహనాల గురించిన చర్చలు మరియు సదస్సులో ఆవిష్కరించిన పలు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే, అంతే కాకుండా రానున్న రోజుల్లో కాలుష్యాన్ని ఎదురించి పోరాడేది ఒక్క ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే. ఇలా ఎలక్ట్రిక్ వాహనాల ప్రత్యేకత గురించి సాగిన సదస్సులో పలు కార్ల తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజా సందర్శనకు ఉంచాయి.

ఈ వేదికలో దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ టిగోర్ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించగా, అగ్రగామి ఎస్యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇ-వెరిటో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారులో 72 వోల్టుల సామర్థ్యం గల బ్యాటరీ సింగల్ ఛార్జింగ్తో గరిష్టంగా 100కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆల్టర్నేట్ కరెంట్ ద్వారా టిగోర్ కారులోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది. ఏదేమైనప్పటికీ, డైరక్ట్ కరెంట్తో కేవలం 90 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 11 లక్షలుగా ఉంది. ఈ ధరతో సాధారణ కార్లలో లభించే అన్ని ఫీచర్లు ఇందులో లభిస్తాయి. అంటే, ఎయిర్ కండీషనింగ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఇంకా ఎన్నో. అదే విధంగా మహీంద్రా ఇ-వెరిటో ధర రూ. 12.5 లక్షలుగా ఉంది. ఇందులో కూడా 72 వోల్టుల బ్యాటరీ కలదు మరియు రెగ్యులర్ ఛార్జింగ్తో 8 గంటలు, పవర్ ఛార్జింగ్తో 90 నిమిషాలు పడుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్యరహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలకు పిలుపునిచ్చాడు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, "రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలకు అవకాశం ఇచ్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం అమితాసక్తితో ఉంది. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు కావాల్సిన ఉత్పత్తులన్నీ ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రిక్ కార్ల తయారీ హబ్గా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వం ధ్యేయమని చెప్పుకొచ్చాడు."

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వాతావరణంలో గాలి నాణ్యత సూచిక నానాటికీ పడిపోతున్న నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు మరియు ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపడం శుభ సూచకం అని చెప్పాలి. ఢిల్లీలో గాలి నాణ్యత 239 పాయింట్లుగా ఉంది. ఒక విధంగా ఇది అత్యంత దారుణంగా ఉందనే చెప్పాలి.

కాలుష్యంతో పోరాడే వాహనాల తయారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదిక కానుండటంతో పలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు తమ తయారీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే అకాశం ఉంది. ఇప్పటికే, టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏ సంస్థ ముందుకొస్తుందో చూడాలి మరి....



Click it and Unblock the Notifications








