మహీంద్రా చేతికి ఫోర్డ్ సంస్థ: అత్యధిక వాటా కొనుగోలు
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మరియు అమెరికాకు చెందిన ప్రసిద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీలు భారత్ మరియు శరవేగంగా అభివృద్ది చెందుతున్న పలు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉమ్మడి భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇరు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం 2020 మధ్య భాగం నుండి అమల్లోకి రానుంది.

ఇరు సంస్థల మధ్య కుదిరిన ఉమ్మడి వ్యాపార సయోధ్య మేరకు, ఫోర్డ్ మోటార్ కంపెనీలో 51 శాతం వాటాను మహీంద్రా దక్కించుకోగా 49 శాతం వాటా ఫోర్డ్ మరియు దాని అనుబంధ సంస్థలకు ఉంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా చెన్నై మరియు గుజరాత్లోని సనంద్ ప్లాంట్లను ఇరు కంపెనీలు నిర్వహించుకోనున్నాయి.

ఏదేమైనప్పటికీ అమెరికన్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా సంస్థ తమ సనంద్ ఇంజన్ ప్రొడక్షన్ ప్లాంటును స్వతహాగానే ఉపయోగించుకోనుంది. ఫోర్డ్కు చెందిన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్, ఫోర్డ్ క్రెడిట్ మరియు ఫోర్డ్ స్మార్ట్ మొబిలిటీ కంపెనీలను కూడా ఫోర్డ్ కంపెనీయే నిర్వహించుకోనుంది. ఇరు కంపెనీలు సెప్టెంబరు 2017 లోనే వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకొచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ కుదిరింది.

ఈ ఉమ్మడి భాగస్వామ్యం ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ సంస్థ మరింత వృద్ది చెందడానికి దోహదపడుతుందని అభిప్రాయం. ఈ భాగస్వామ్యం ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తి చేసే కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు సహకరిస్తుంది. దేశీయ కార్యకలాపాలు మాత్రం మునుపటిలాగే ఏ కంపెనీ డీలర్ ఆ కంపెనీ కార్లనే యథావిధిగా విక్రయిస్తారు.

అంతర్జాతీయ మార్కెట్లో మహీంద్రా లేనిచోట్ల ఫోర్డ్ ద్వారా ఎగుమతులు చేసి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు మహీంద్రాకు ఈ జాయింట్ వెంచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. అంతే కాకుండా ఇరు సంస్థలు కొత్త సాంకేతిక అభివృద్ది, నూతన ఆవిష్కరణలు మరియు ప్రొడక్షన్ను పంచుకోనున్నాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ నానాటికీ క్షీణిస్తుండటంతో కొన్ని చిన్న సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఉత్పత్తుల అభివృద్దితో పాటు ఇరు సంస్థలు సేల్స్ పెంచుకుని నిలదొక్కుకోవడంలో ఈ జాయింట్ వెంచర్ ఎంతగానో సహకరిస్తుంది. దేశీయ దిగ్గజం మహీంద్రా విదేశాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఈ నిర్ణయం కలిసిరానుంది.


Click it and Unblock the Notifications








