జనవరి నుండి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
కరోనా మహమ్మారి కారణంగా 2020వ సంవత్సరం కార్ కంపెనీలకు చేదు సంవత్సరంగా మిగిలిపోనుంది. అయితే, కొత్త సంవత్సరం (2021) కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రం చేదు సంవత్సరంగా మారనుంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన కార్ కంపెనీలన్నీ వచ్చే ఏడాది నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

తాజాగా, దేశపు అతిపెద్ద కార్ కంపెనీల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఇదే బాటలో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం ధరలను కొత్త సంవత్సరంలో పెంచాలని భావిస్తోంది. మార్కెట్ లీడర్గా మారుతి సుజుకి ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసినదే. మారుతి బాటలోనే ఫోర్డ్, కియా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ధరల పెంపును ప్రకటించాయి.

కియా మోటార్స్ యొక్క భాగస్వామి సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా, వచ్చే జనవరిలో ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ అందిస్తున్న ప్రోడక్ట్ లైనప్లోని అన్ని మోడళ్ల ధరలను కొంతమేర పెంచాలని కంపెనీ భావిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

కియా మోటార్స్ కూడా జనవరి 1, 2021వ తేదీ నుండి తమ సొనెట్ మరియు సెల్టోస్ మోడళ్ల ధరలు పెంచుతామని ప్రకటించింది. కార్నివాల్ మోడల్ ధర పెంపు గురించి కంపెనీ ప్రస్తావించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే, కొత్త సంవత్సరంలో ఈ ప్రీమియం ఎమ్పివి ధరలు మాత్రం పెరగబోవని తెలుస్తోంది.

హ్యుందాయ్ ఇయర్ ఎండ్ ఆఫర్స్:
ఇదిలా ఉంటే.. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ డిసెంబర్ 2020 నెలలో భాగంగా, కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ విక్రయిస్తున్న శాంత్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా మరియు ఎలంట్రా మోడళ్లపై నగదు తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ అందిస్తున్న ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లలో కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ను బట్టి కస్టమర్లు గరిష్టంగా రూ.1 లక్ష వరకు విలువై ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 31, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయి. - మోడల్ వారీగా లభిస్తున్న ఆఫర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హ్యుందాయ్ స్మార్ట్ కేర్ కార్ క్లినిక్:
హ్యుందాయ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ వినియోగదారుల కోసం దేశవ్యాప్తంగా స్మార్ట్ కేర్ కార్ క్లినిక్ సర్వీస్ క్యాంపైన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్యాంపైన్ డిసెంబర్ 14వ తేదీ నుండి ప్రారంభమై డిసెంబర్ 23, 2020 వరకు కొనసాగుతుందని తెలిపింది.

హ్యుందాయ్కి దేశవ్యాప్తంగా ఉన్న 1288కి పైగా అధీకృత హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లు ఈ క్యాంపైన్లో పాల్గొంటున్నాయి. ఈ సమయంలో హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లకు తీసుకువచ్చే వాహనాల సర్వీస్ మరియు స్పేర్స్పై కంపెనీ ప్రత్యేకమైన తగ్గింపులను అందిస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ @ 30,000 మార్క్:
మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న సరికొత్త 2020 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం 40 రోజుల్లోనే 30,000 యూనిట్లకు పైగా బుకింగ్లను దక్కించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్తో లభిస్తోంది. పెట్రోల్ ఇంజన్లలో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ యూనిట్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, ఇందులో 1.5 లీటర్ డీజిల్ యూనిట్ కూడా అందుబాటులో ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








