ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ నిలిపివేత; ప్రభుత్వం చెప్పే కారణం వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
ఎలక్ట్రిక్ కార్ కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించి, తద్వారా కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో, కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఆప్ (AAP) సర్కార్ అమలు చేస్తున్న సబ్సిడీ విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. అదేంటో చూద్దాం రండి.

గత ఏడాది ప్రారంభంలో ప్రారంభించిన ఢిల్లీ ఈవీ విధానం (Delhi EV Policy) ప్రకారం, దేశ రాజధానిలో కొనుగోలు చేసిన మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ కార్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ టార్గెట్ మించి పోవడం, రాష్ట్రంలో 1,000 కి పైగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు జరగడంతో ప్రభుత్వం ఈ సబ్సిడీ పథకాన్ని విరమించుకుంది. అంతేకాకుండా, ఇంతటి ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయగలిగిన కస్టమర్లు, తాము ఇచ్చే పిసరంత సబ్సిడీతో అసలు పనేంటని కూడా వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన ఈవీ పాలసీ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicle) విషయంలో ఒక్కో kWh బ్యాటరీ కెపాసిటీకి రూ. 10,000 సబ్సిడీని అందించారు. ఈ రకంగా, ఎలక్ట్రిక్ కార్ల ధరలో కస్టమర్లు సుమారు రూ. 1.5 లక్షలకు వరకూ ప్రయోజనం పొందారు. అంతేకాకుండా, ఇలాంటి వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా రద్దు చేశారు. అయితే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో తాము అనుకున్న స్థాయికి ప్రభుత్వం చేరుకుందని, ఇక ఎలక్ట్రిక్ కార్లపై ఎలాంటి సబ్సిడీ ఉండబోదని ఆ రాష్ట్ర రవాణా శాఖా మంతి కైలాష్ గహ్లోట్ అన్నారు.

ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల కోసం AAP ప్రభుత్వం తమ లక్ష్యాన్ని చేరుకున్నందున మరియు నగరంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ఊపందుకున్నందున నేపథ్యంలో, ఇకపై ఎలక్ట్రిక్ కార్ల (Electric Car) కొనుగోలుపై రాయితీలను పొడిగించే ఆలోచన లేదని రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం, ఢిల్లీలో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ పెరగడమే అని చెబుతున్నారు.

ఈ విషయం గురించి కైలాష్ గహ్లోట్ మాట్లాడుతూ, "ఢిల్లీలో ఎలక్ట్రిక్ కార్ల విభాగానికి అవసరమైన పుష్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటికే 10 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వాహనాలు ప్రధాన భాగంగా ఉన్నందున, ఎలక్ట్రిక్ వాహనాల (EVల) విభాగంలో ఇప్పుడు ప్రధానంగా ద్విచక్ర వాహనం, సరుకు రవాణా మరియు ప్రజా రవాణా విభాగాలపై దృష్టి సారించాము. ప్రైవేట్ కార్లతో పోలిస్తే ఇవి రోడ్డుపై ఎక్కువగా తిరుగుతాయి, తద్వారా ఎక్కువ కాలుష్యం ఏర్పడుతుంది." అని అన్నారు.

"వాస్తవానికి, ఇ-కార్లకు సబ్సిడీ అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి వాహనం కోసం సుమారు రూ. 15 లక్షలు చెల్లించగలిగే వారు, రూ. 1-2 లక్షల రాయితీ గురించి పెద్దగా పట్టించుకోరు. రాయితీని అత్యంత అవసరమైన వారికి అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఇలాంటి వారిలో ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహన యజమానులు, డెలివరీ భాగస్వాములు మరియు ఇతరులు ఉన్నారు, " అని గహ్లాట్ తెలిపారు.

ఢిల్లీ ఈవీ పాలసీని 2020లో ప్రవేశపెట్టారు. ఈ పాసరీ ప్రకారం, నగరంలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే మొదటి 1,000 మంది కస్టమర్లకు సదరు ఎలక్ట్రిక్ కార్లపై ఒక్కో kWh బ్యాటరీ కెపాసిటీకి రూ. 10,000 చొప్పున సబ్సిడీని అందించారు. దీనిని మొత్తంగా ఒక్కొక్క ఎలక్ట్రిక్ కారుపై గరిష్టంగా రూ. 1.5 లక్షలకు పరిమితం చేశారు. అలాగే, ద్విచక్ర వాహనాలతో సహా ఇతర ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో, ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యంపై సబ్సిడీ మొత్తం రూ. 5,000 వరకూ అందించారు. ఇలా గరిష్టంగా ఒక్కొక్క వాహనంపై రూ. 30,000 కు పరిమితం చేశారు.

ఈ ఏడాది జూలై - సెప్టెంబర్ 2021 మధ్య ఢిల్లీలో మొత్తం 1.50 లక్షల వాహనాలు నమోదయ్యాయి. వీటిలో 7,869 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అంటే మొత్తం నమోదైన వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 7 శాతం వరకూ ఉంది. అలాగే, ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఢిల్లీలో 22,805 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. అంటే ఢిల్లీలో గత 4 నెలల్లోనే దాదాపు 31,000 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

ఈ విషయం గురించి గహ్లోట్ మాట్లాడుతూ.. తాము తమ ఎలక్ట్రిక్ వాహన విధానం నుంచి మంచి ఫలితాలను చూస్తున్నామని మరియు అటువంటి వాహనాల స్వీకరణ వేగం కూడా పుంజుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క విజన్ ప్రకారం, ఢిల్లీని దేశ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా చేయాలనే కలను సాకారం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని గహ్లోట్ చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లపై ఉన్నట్టుండి సబ్సిడీలు నిలిపివేయడంతో, మరి దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాలి. - లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








