హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్లో భారీ మార్పులు.. అవేంటో మీరే చూడండి..!
హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటా లైనప్లో కంపెనీ పలు మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా అప్డేటెడ్ చేయబడిన క్రెటా బేస్ వేరియంట్ చిత్రాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.

రష్లేన్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం, హ్యుందాయ్ డీలర్షిప్లకు పంపిణీ చేయబడుతున్న కొత్త బేస్ వేరియంట్ (ఈ) క్రెటా మరియు ఆ మోడల్లో చేసిన మార్పులను ఇందులో గమనించవచ్చు. హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ ఇటీవలే తమ సెల్టోస్ను అప్డేట్ చేసినట్లుగా హ్యుందాయ్ కూడా తమ క్రెటాను అప్డేట్ చేసింది.

ఈ మేరకు హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ వేరియంట్ లైనప్లో కంపెనీ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇందులోని బేస్ వేరియంట్లో కొన్ని ఫీచర్లను తొలగించగా, మిడ్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో కంపెనీ కొన్ని కొత్త మరియు ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించింది.

హ్యుందాయ్ క్రెటా ఈ బేస్ వేరియంట్లో ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్లు తొలగించి వాటి స్థానంలో మ్యాన్యువల్గా సర్దుబాటు చేసే వాటిని అమర్చారు. అలాగే, ఈ సైడ్ మిర్రర్లపై అందించిన టర్న్-ఇండికేటర్లను కూడా తొలగించి, వాటిని ఫ్రంట్ ఫెండర్లపైకి మార్చారు.

అంతేకాకుండా, ఈ వేరియంట్ లగేజ్ కంపార్ట్మెంట్ అందించిన లైటింగ్ మరియు ప్యాసింజర్ సీటు వెనుక భాగంలో అందించిన సీట్ పాకెట్ను కూడా ఇందులో తొలగించారు. ఈ మార్పులు మినహా క్రెటా బేస్ వేరియంట్లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఈ మోడల్ ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ అప్డేట్స్ చేసినట్లు తెలుస్తోంది.

మిడ్-రేంజ్ హ్యుందాయ్ క్రెటా ఈఎక్స్ మరియు ఎస్ వేరియంట్లలో కంపెనీ అదనపు ఫీచర్లను అందించనుంది. ఇప్పుడు ఈ వేరియంట్లలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ఫీచర్ లభ్యం కానుంది. ఇప్పటి వరకూ వేరియంట్లలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ఫీచర్లను హార్డ్ వైర్ కనెక్టివిటీ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసలుబాటు ఉండేది. అయితే, ఇకపై వీటిని వైర్ లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇకపోతే, హ్యుందాయ్ క్రెటా టాప్-ఎండ్ వేరియంట్లయిన ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) లలో కంపెనీ పెద్ద అప్గ్రేడ్స్ను చేయనుంది. ఈ వేరియంట్లలో ఆఫర్ చేస్తున్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇప్పుడు ఓవర్ ది ఎయిర్ (ఓటిఏ) అప్డేట్తో రానున్నాయి. ఇంకా ఇందులోని పవర్ విండోస్, కాంటాక్ట్స్ మరియు మ్యూజిక్ను వాయిస్ కమాండ్స్తో కంట్రోల్ చేయవచ్చు.

అలాగే, ఈ టాప్-ఎండ్ వేరియంట్లలోని ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్బాక్స్ వెర్షన్స్ ఇప్పుడు రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ ఫీచర్తో రానున్నాయి. అంతేకాకుండా, ఈ వేరియంట్లలోని డాష్బోర్డ్పై కొత్త సాఫ్ట్ పెయింట్ ఫినిషింగ్ను కూడా జోడించారు.

ఇంకా, ఇందులో వాయిస్ గ్రీటింగ్ మెసేజ్ను కూడా అప్డేట్ చేశారు. ఈ కొత్త కారులో ఇంజన్ను స్టార్ట్ చేయగానే ఓ స్వాగత సందేశం (వెల్కమ్ గ్రీటింగ్) వినిపిస్తుంది. ఈ గ్రీటింగ్ అందించే విధానం సీజన్ మరియు సమయం ప్రకారం మారుతూ ఉంటుంది. డ్రైవర్లు మరియు ప్రయాణీకులు సీట్ బెల్టులు ధరించమని కూడా ఈ గ్రీటింగ్ మెసేజ్ గుర్తు చేస్తుంది.

ఇదిలా ఉంటే, గడచిన ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ తమ క్రెటా డీజిల్ వెర్షన్ ధరలను రూ.19,600 మేర పెంచగాపెట్రోల్ వెర్షన్ ధరలు రూ.13,600 మేర పెంచిన సంగతి తెలిసినదే. అయితే, క్రెటా బేస్ పెట్రోల్ ఈ వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది మునుపటి మాదిరిగానే రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది.
Source: Rushlane


Click it and Unblock the Notifications








