నేటి నుంచి కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్
హైదరాబాద్: నగరంలో ఇకనుంచి వాహనాల దొంగతనాలకు, అక్రమ వాహనాలకు చెక్ పెట్టనున్నారు ఆర్టీయే అధికారులు. నేటి నుంచి రంగారెడ్డి జిల్లాలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ కొత్త హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవటం వలన వాహనాల సమాచారం వేగంగా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి వీటిని ఆర్టీయే అధికారుల సమక్షంలో వీటిని అమర్చనున్నారు.
నేటి (డిసెంబర్ 11, 2013) నుంచి రిజిస్టర్ అయ్యే అన్ని కొత్త వాహనాలకు వీటిని అమర్చాల్సిందిగా ప్రభుత్వ చీఫ్ స్పెషల్ సెక్రటరీ ఆదేశాలను జారీ చేశారు. ప్రతి హైసెక్యూర్డ్ నెంబర్ ప్లేటుపై ఎంబోస్డ్ నెంబర్ (ఉబ్బెత్తుగా ఉండే అక్షరాలతో కూడిన నెంబర్), లేజర్ బార్ కోడ్, ఒరిజినల్ సెక్యూరిటీ హాలోగ్రామ్, స్మార్ట్ సిమ్ వంటి సాంకేతికతలు ఉంటాయి. ఇవి ట్యాంపర్ ప్రూఫ్ నెంబర్ ప్లేట్లు, స్మార్ట్ లాక్తో లభిస్తాయి. వీటిని తొలగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే, అవి విరిగిపోతాయి.

ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై ఎనిమిది అంకెల విశిష్టమైన కోడ్ ఉంటుంది. ఈ కోడ్ సాయంతో వాహదారుల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే, ఇందులోని స్మార్ట్ సిమ్ సాయంతో, కారు ఏ ప్రాంతంలో తిరగుతుందో కూడా జిపిఎస్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. నేటి నుంచి (డిసెంబర్ 11, 2013, బుధవారం) రిజిస్టర్ అయ్యే ప్రతి కొత్త వాహనానికి ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ను అమర్చనున్నారు.
అయితే, పాత వాహనాల విషయంలో మాత్రం వాహనదారులకు మరో రెండేళ్ల సమయాన్ని కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంటే, ఇదివరకే రిజిస్టర్ అయి ఉన్న వాహనాలు డిసెంబర్ 10, 2015 లోపుగా తమ పాత రిజిస్ట్రేషన్ నెంబర్ల స్థానంలో కొత్త హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అమర్చుకోవచ్చు. వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్స్ అమర్చేందుకు ప్రత్యేక రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీయే అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ధరలు ఇలా ఉన్నాయి.

- ద్విచక్ర వాహనం - రూ. 245
- త్రిచక్ర వాహనం- రూ. 282
- లైట్ మోటార్ వెహికల్, కారు - రూ.619
- వాణిజ్య, భారీ, ట్రైలర్ వాహనం - రూ.649


Click it and Unblock the Notifications








