సిగ్నల్ జంప్ చేసే అలవాటుందా..? అయితే పారాహుషార్!!
హైదరాబాద్: మీకు తరచూ ట్రాఫిక్ సిగ్నల్ దాటే అలవాటుందా..? అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండంది, లేదంటే మీ జేబుకు భారీ చిల్లుపడే ఆస్కారం ఉంది. నగరంలో ట్రాఫిక్ తప్పిదాలకు విధించే జరిమానాలను ఇటీవలే భారీగా పెంచిన సంగతి తెలిసినదే. సిగ్నల్ జంప్ చేస్తే ఇదివరకు రూ.200 విధించే జరిమానా, ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది. అంతేకాకుండా, సిగ్నల్ నిబంధనను ఉల్లంఘించే వారిని ఆటోమేటిక్గా గుర్తించి, ఫొటోతో సహా క్యాప్చూర్ చేసే అధునాతన పరికరాలను రోడ్ల కూడళ్లలో అమర్చారు నగర ట్రాఫిక్ పోలీసులు.
ఆటేమేటిక్ రెడ్ లైట్ వయోలేషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఏఆర్ఎల్విడిఎస్)గా పిలిచే అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిస్టమ్ను నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో అమర్చారు. ట్రాఫిక్ పోలీసుల అవసరం లేకుండానే ఇవి ఆటోమేటిక్గా నిబంధన ఉల్లంఘించిన వారిని గుర్తించి, స్పష్టమైన ఫొటోలను కూడా చిత్రీకరిస్తాయి. ఇలా చిత్రీకిరంచిన సిగ్నల్ ఉల్లంఘనకు పాల్పడిన వారి ఫొటోలను సాక్ష్యంగా పరిగణించి ఈ-ఛలాన్ను జనరేట్, సదరు వాహనాదారుని చిరునామాకు పంపించడం జరుగుతుంది.
ఈ కెమెరాలు పవర్ఫుల్ ఫ్లాష్ పరికరాలతో అమర్చబడి ఉంటాయి. రాత్రి వేళల్లో సైతం ఇవి స్పష్టమైన చిత్రాలను తీయగలవు. ఏఆర్విఎల్డిఎస్ లను ఇప్పటికే కెసిపి జంక్షన్, కెబిఆర్ పార్క్ జంక్షన్, రోడ్ నెం.1/10 బంజారా హిల్స్, శ్రీనగర్ టి జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మరియు స్వీకర్ ఉపహార్ జంక్షన్ల వద్ద అమర్చారు. మరికొన్ని జంక్షన్లలో అమర్చేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. వీటి సాయంతో రోజుకు సగటున 400 లకు పైగా సిగ్నల్ ఉల్లంఘన కేసులను పోలీసులు బుక్ చేస్తున్నట్లు సమాచారం.
కాబట్టి ఈసారి సిగ్నల్ జంప్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం పారాహుషార్..! మూడో కన్ను మిమ్మల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటుంది.

మూలం: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్


Click it and Unblock the Notifications








