ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో క్వాడ్రిసైకిల్స్ ప్రవేశంపై హైకోర్ట్ స్టే
దేశంలో 'క్వాడ్రిసైకిల్స్' (నాలుగు చక్రాలు కలిగిన ప్రయాణీకుల రవాణా వాహనాల)ను తిప్పుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో మాత్రం వీటిని ప్రవేశపెట్టేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భారత ప్రభుత్వం గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో క్వాడ్రిసైకిల్ విభాగానికి గుర్తింపునిచ్చి, వీటి విషయంలో కొత్త నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసినదే.
ఈ కొత్త రకం నాలుగు చక్రాల ఆటోరిక్షాల (క్వాడ్రిసైకిళ్లు)ను నగరంలో అనుమతిస్తే, తమ జీవనాధారం దెబ్బతింటుందని, అందుకే వీటిని నగరంలో అనుమతించడాన్ని నిషేధించాలని గ్రేటర్ హైదరాబాద్ ఆటోరిక్షా యూనియన్ (మూడు చక్రాల ఆటోరిక్షాలకు చెందిన యూనియన్) హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ విషయంలో యూనియన్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు క్వాడ్రిసైకిళ్ల ప్రవేశంపై స్టే విధించింది.

ఈ మేరకు ఛీఫ్ జస్టిస్ కళ్యాన్ జ్యోతి సెంగుప్తా, జస్టిస్ పివి సంజయ్ కుమార్లతో కూడి ధర్మాసనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో క్వాడ్రిసైకిళ్ల ప్రవేశంపై స్టే విధిస్తూ మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి క్వాడ్రిసైకిళ్లు ఈ ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్ర మార్కెట్లలో ప్రవేశించాల్సి ఉన్నాయి. భారత రోడ్లపై క్వాడ్రిసైకిళ్లు సురక్షితమైనవి కావని, ఇవి లోపపూరితమైన డిజైన్ను కలిగి ఉన్నప్పటికీ, పార్లమెంట్ ఆమోదం లేకుండానే వీటిని రోడ్లపై ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని పిటీషనర్లు వాదిస్తున్నారు.
క్వాడ్రిసైకిల్స్ విషయానికి వస్తే.. ఈ రకం వాహనాలను కేవలం నగర పరిధిలో (సిటీ లిమిట్స్)నే వినియోగించేందుకు మాత్రమే గతంలో ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిని కేవలం ప్రజా రవాణా మరియు వాణిజ్య రవాణా (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు కమర్షియల్ ట్రాన్స్పోర్ట్) వాహనాలుగా మాత్రమే వినియోగించాలని, రెగ్యులర్ కార్ల మాదిరిగా వ్యక్తిగత రవాణా (పర్సనల్ ట్రాన్స్పోర్ట్) కోసం ఉపయోగించరాదని మార్గనిర్దేశం కూడా చేసింది.

వాస్తవానికి, ప్రస్తుతం నగర రోడ్లపై తిరుగుతున్న సాంప్రదాయ త్రిచక్ర వాహనాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ కాడ్రిసైకిల్ను పరిగణించడం జరుగుతుంది. కాడ్రిసైకిల్స్ విషయంలో క్రాష్ టెస్ట్ సౌకర్యం లేదు కాబట్టి, ఇవి తప్పనిసరిగా డ్యూయెల్ కార్-టైప్ బ్రేకింగ్ సిస్టమ్ను కలిగి ఉండాలి. అంతేకాకుండా, వీటిలో 450 కిలోలకు మంచి ఎక్కువ బరువు కలిగి ఉండేలా ప్రయాణికులను తరలించకూడదు. ఇవి 3 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉండకూడదు.
కమర్షియల్ వేరియంట్స్ విషయంలో పేలోడ్ 550 కేజీలు ఉండాలి, వీటి పొడవు 3.7 మీటర్ల వరకు ఉండొచ్చు. ప్యాసింజర్ వెర్షన్ క్వాడ్రిసైకిళ్లలో నలుగురు వ్యక్తులకు మించి ప్రయాణించకూడదు (డ్రైవర్తో కలిపి). బ్యాటరీతో నడిచే క్వాడ్రిసైకిళ్ల విషయంలో మొత్తం బరువు లోనుంచి బ్యాటరీ బరువును మినహాయించారు. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ విషయంలో ఇంకా ఓ తుది నోటిఫికేషన్ విడుదల కాలదేని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








