ఏపి సిఎం సహాయ నిధికి 5 పికప్లను ఇచ్చిన ఇసుజు ఇండియా
సాగరతీర నగరం విశాఖపట్నం ఇటీవల సంభవించిన హుధుద్ తుఫాను ధాటికి చిన్నాభిన్నమైన సంగతి తెలిసినదే. ఈ నగరాన్ని పునరుద్ధరించేందుకు ఇప్పటికే అనేక సంస్థలు, ప్రముఖులు స్వచ్ఛందగా విరాళాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా.. జపనీసన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ఇండియా కూడా తమ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా 5 డి-మ్యాక్స్ పికప్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది. ఈ ఇసుజు 5 డి-మ్యాక్స్ పికప్ వాహనాల తాళం చెవులను ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టకాషి కికుచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విశాఖపట్నం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 'ఈ కష్టకాలంలో కార్పోరేట్లు మనకు అండగా నిలిచేందుకు చేరుకోవడం హృదయాన్ని కదిలిస్తోంది. ఏపిలో తమ తయారీ కేంద్రాన్ని నెలకొల్పిన మొదటి వాహన తయారీదారు ఇసుజు. అంతేకాకుండా, ఉపశమన ప్రయత్నాలకు వాహనాలను విరాళంగా అందించిన మొదటి కార్పొరేట్ సంస్థ కూడా ఇసుజునే కావటం విశేషం అన్నారు.

విశాఖపట్నం పునర్నిర్మాణంలో ముందుకు వస్తున్న బాధ్యతాయుత కార్పోరేట్ సంస్థలన్నింటికీ సిఎం అభినందనలు తెలియజేశారు. కాగా.. ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టకాషి కికుచి మాట్లాడుత.. ఇసుజు ఎల్లవేళలా తన కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, విద్య, జీవినోపాధి సాయం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిందని, 2011లో ఆస్ట్రేలియాలో వచ్చిన వరదలు, 2011లో జపాన్లో వచ్చిన భూకంపం, 2013లో ఫిలిప్పీన్స్లో వచ్చిన టైఫూన్ యోలండా విపత్తు ఏదైనా సరే, తమ వంతు సాయం చేసేందుకు ఇసుజు ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications








