కార్లలో స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి - క్యాబ్ డ్రైవర్ల వేగానికి కళ్లెం!
ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో ఉన్న క్యాబ్ మరియు ట్యాక్సీలలో స్పీడ్ గవర్నర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ట్యాక్సీ మరియు క్యాబ్లలో వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ గవర్నర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను అరికట్టడానికి ఈ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ పరిధిలో ఉన్న ట్యాక్సీలు మరియు క్యాబ్ల వేగం గరిష్టంగా గంటకు 80కిలోమీటర్లకు మించకూడదని కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చారు.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల గణాంకాల మేరకు ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2014 లో 1671 మరియు 2015 లో 1622 మంది మరణించగా ఈ రెండు సంవత్సరాల్లో 16,000 మంది వరకు గాయపడినట్లు తెలిసింది.

ఢిల్లీ ట్యాక్సీ యూనియన్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ సోనీ మాట్లాడుతూ, " ఒక్కో స్పీడ్ గవర్నర్ కనీస ధర రూ. 10,000 లుగా ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేదంటే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు".

ప్రభుత్వం తీసుకున్న ఈ గరిష్ట వేగ పరిమితి నిర్ణయం ట్యాక్సీలు, క్యాబ్లు అదే విధంగా అద్దె కార్ల సర్వీసులను నిర్వహిస్తున్న ఓలా మరియు ఉబర్ సంస్థలకు చెందిన వెహికల్స్కు కూడా వర్తిస్తాయి.

మితిమీరిన వేగం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇందుకు నిదర్శనం హైదరాబాద్లో నమోదవుతున్న రోడ్డు ప్రమాదాలే. వేగ నిరోధకాలు, సిగ్నల్స్ ఎన్ని ఉన్నప్పటికీ ప్రమాదాల రేటు నానాటికీ పెరుగుతూనే ఉంది.

ఢిల్లీ తరహాలో కార్లలో స్పీడ్ గవర్నర్ల ఏర్పాటును తప్పనిసరి చేయడం ఓ పరిష్కారం అని చెప్పవచ్చు. స్పీడ్ గవర్లలో మనం ముందుగా నిర్ధేశించిన వేగాన్ని మించిన వేగంతో వాహనాన్ని నడపడం అసాధ్యం. కాబట్టి మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలకు కళ్లెం వేసినట్లవుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజధాని నగరాలతో పాటు మిగతా ప్రధాన నగరాలలో కూడా కార్లలో స్పీడ్ గవర్నర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








