బిఎస్3 మరియు బిఎస్4 మధ్య నెలకొన్న గందరగోళానికి సమధానం
దేశ సర్వోన్నత న్యాయస్థానం విపణిలోకి బిఎస్3 వాహనాల విక్రయాలను రద్దు చేసిన అనంతరం అందిరినీ తొలిచేస్తున్న ప్రశ్న బిఎస్3 అంటే ఏమిటి? అదే విధంగా బిఎస్3 మరియు బిఎస్4 కు మధ్య గల తేడాలేంటి?
పర్యావరణాన్ని మరియు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయంగా బిఎస్3 వాహనాల విక్రయాలను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుండి బిఎస్3 మరియు బిఎస్4 అనే పదాన్ని విన్నవారంతా అసలు బిఎస్3 మరియు బిఎస్4 అంటే ఏమిటని ప్రశ్నించుకుంటున్నారు. ఇవాళ్టి కథనంలో బిఎస్3 మరియు బిఎస్4 అంటే మరియు వీటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం రండి....

బిఎస్ అంటే ఏమిటి ?
బిఎస్ అనగా భారత్ స్టేజ్ అని అర్థం. ఇంధనం మండించి పొగను బయటకు వెదజల్లే ఇంజన్ల యొక్క ఉద్గారాలను కొలిచి, అవి ఉత్పత్తి చేసే కాలుష్య కారకాల మోతాదు ఇంత మొత్తంలో మాత్రమే ఉండాలని భారత ప్రభుత్వం ఈ భారత్ స్టేజ్ ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చింది.

యూరప్లో కూడా ఈ ఉద్గార ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయి, అన్ని వాహన తయారీ సంస్థలు కూడా ప్రతి వాహనాన్ని ఆ ప్రమాణాలకు లోబడి తయారు చేయాల్సి ఉంటుంది. యూరప్లో ప్రారంభమైన ఉద్గార ప్రమాణాలను భారత ప్రభుత్వం దేశీయ వాహన పరిశ్రమకు అమలు చేస్తోంది.

బిఎస్ మరియు యూరో నిబంధనల ఏర్పాటు
భారత ప్రభుత్వం తొలి ఉద్గార నియమ నిబంధనలను 1991 లో పెట్రోల్ వాహనాలకు ఆ తరువాత ఏడాది డీజల్ వాహనాలకు విధించింది. బిఎస్1తో ప్రారంభమయ్యి బిఎస్2, బిఎస్3 మరియు బిఎస్4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

బిఎస్1 నియమం అమల్లో ఉన్నపుడు ఇంజన్ ఉత్పత్తి చేసే ఉద్గారాల మోతాదుకు లిమిట్ ఉంటుంది. అంటే ఇంజన్ ద్వారా వెలువడే పొగలోని కాలుష్య కారకాల మోతాదు బిఎస్1 నిబంధనలో వెల్లడించిన పరిమాణం కన్నా మించి ఉండకూడదు.

భారత్ స్టేజ్1 నుండి భారత్ స్టేజ్2 కు ఉద్గార నిబంధనల్లో మార్పు చేయడం
ఉద్గార నిబంధనలను కఠినం చేయడానికి బిఎస్1 కన్నా బిఎస్2 లో కాలుష్య కారకాల మోతాదు తక్కువగా ఉండాలి. ఇలా అప్గ్రేడ్స్ నిర్వహిస్తూ ఉండటం ద్వారా పాత నిభందనలను పాటించే ఇంజన్ల కన్నా కొత్త నిబంధనలను పాటించే ఇంజన్లు తక్కువ కాలుష్య కారకాలను పర్యావరణంలోకి విడుదల చేస్తాయి.

ఇంజన్లు ఉత్పత్తి చేసే కాలుష్య కారకాలైన కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ రసాయన మూలక ఉద్గారాల మోతాదును పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయిస్తుంది.

ఉదాహణరకు:
ఇక్కడ ఉన్న ఫోటోను గమనిస్తే, కార్బన్ మోనాక్సైడ్(Co) మరియు నైట్రస్ ఆక్సైడ్(NOx) గ్రాఫ్ను గమనించినట్లయితే ఎరుపు రంగు పెట్టెలోని బిఎస్3 మరియు ఆకుపచ్చ రంగు పెట్టెలోని బిఎస్4 లను గుర్తించగలరు.

బిఎస్3 వద్ద ఉన్న కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్ల మోతాదును బిఎస్4 తో పోల్చుకుంటే, కాలుష్య కారకాల మోతాదు ఎంత మేరకు తగ్గిందో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, సుప్రీం కోర్టు దీనిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా బిఎస్-3 ఉద్గార నియమాలను పాటించే వాహనాల విక్రయాలను రద్దు చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడం ద్వారా మునుపటితో పోల్చుకుంటే కాలుష్యం గణనీయంగా తగ్గిపోనుంది.

వాహన తయారీ పరిశ్రమలు ఏమంటున్నాయి ?
దేశీయంగా ఉన్న వివిధ వాహన తయారీ సంస్థలు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించి బిఎస్4 ప్రమాణాలకు అనుగుణంగా వెహికల్స్ను అప్గ్రేడ్ చేశాయి. అయితే మరికొన్ని సంస్థలు మాత్రం, బిఎస్4 అప్గ్రేడ్కు నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది మరియు బిఎస్3 స్టాకు పూర్తి చేసుకునేందుకు కూడా తగిన సమయం ఇవ్వలేదని వాపోతున్నాయి.

సుప్రీం కోర్టు సమాధానం...
ప్రజల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, ప్రస్తుతం దేశీయంగా ఉన్న మహానగరాలు వాహన కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి తద్వారా ఆయా నగరాల్లోని ఉన్న వాతావరణంలో హానికర విపత్తులకు ఆస్కారంముందని తెలిపింది.

బిఎస్-4 తరువాత ఎలాంటి నియమాలు ?
బిఎస్4 నియమం ప్రకారం ఉన్న రసాయన కాలుష్య కారకాల మోతాదును మరింత తగ్గిస్తూ బిఎస్6 నిబంధనను భారత ప్రభుత్వం 2020లో అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం జరిగిన తంతు 2020లో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








