భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు
జీఎస్టీ సెస్ పెంపు కారణంగా హ్యుందాయ్ మోటార్స్ తమ కార్ల మీద ధరలు పెంచింది. హ్యుందాయ్ కార్ల మీద పెరిగిన జీఎస్టీ మరియు కార్ల వివరాలు మరియు జీఎస్టీ ప్రభావం
దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో ఒక్కొక్క కార్ల తయారీ సంస్థ తమ కార్ల మీద ధరల పెంపు చేపడుతున్నాయి. పండుగ సంధర్భంలో తమకు నచ్చిన కారును ఎంచుకోవాలని ఎంతో మంది ప్లాన్ చేసుకుంటారు. అయితే, అనూహ్యంగా జీఎస్టీ సెస్సులో జరిగిన మార్పులు కారణంగా ఇప్పుడు కార్ల సంస్థలు ధరల పెంపు బాట పట్టాయి.

జీఎస్టీ సెస్ పెంపునకు అనుగుణంగా హ్యుందాయ్ మోటార్స్ తమ పాపులర్ మోడళ్ల మీద వివిధ వేరియంట్లపై రూ. 84,867 ల వరకు ధరలను పెంచింది. ఏయే కార్ల మీద ఏ మేరకు ధరలు పెరిగాయో చూద్దాం రండి...

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, ఇండియా లైనప్లో వివిధ మోడళ్ల మీద 2 నుండి 5 శాతం వరకు ధరలు పెరిగినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 11, 2017 నుండి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. విపణిలో ఉన్న ఐ20, వెర్నా, క్రెటా, ఎలంట్రా మరియు టుసాన్ ఎస్యూవీ వాహనాల మీద ధరలు పెరిగాయి.
Recommended Video


అయితే, హ్యుందాయ్ వద్ద ఉన్న గ్రాండ్ ఐ10 హ్యాచ్బ్యాక్ మరియు ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కార్ల మీద మాత్రం ధరలు పెరగలేదు. హ్యుందాయ్ ఐ20లో కూడా 1.4-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ వేరియంట్ మీద మాత్రమే రూ. 12,547 ల వరకు ధర పెరిగింది. మిగతా అన్ని ఐ20 వేరియంట్ల మీద ఎలాంటి ధరల పెంపు జరగలేదు.

హ్యుందాయ్ మోటార్స్ తాజాగా విడుదల చేసిన వెర్నా సెడాన్ మీద రూ. 29,090 ల వరకు ధర పెరిగింది. ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మరియు జీప్ ఇండియా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచాయి.

జీఎస్టీ సవరణ అనంతరం హ్యుందాయ్ కార్ల మీద ధరలు పెంపు ఇలా...
| మోడళ్లు | పెరిగిన ధరలు |
| ఎలైట్ ఐ20(1.4-లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ మాత్రమే) | రూ. 12,547 లు |
| వెర్నా | రూ. 20,090 ల వరకు... |
| క్రెటా | రూ. 20,900 నుండి 55,375 ల వరకు |
| ఎలంట్రా | రూ. 50,312 నుండి 75,991 ల వరకు |
| టుసాన్ | రూ. 64,828 నుండి 84,867 ల వరకు |

జీఎస్టీ ట్యాక్స్ విధానంలో కార్ల మీద 28 శాతం గరిష్ట ట్యాక్స్తో పాటు వివిధ రకాల సెగ్మెంట్ మరియు బాడీ స్టైల్ ఆధారంగా 1 నుండి 22 శాతం వరకు సెస్ అమల్లో ఉంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
విపణిలో మారుతి సుజుకి తర్వాత అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న సంస్థ హ్యుందాయ్ మోటార్స్. సరిగ్గా ఫెస్టివల్ సీజన్కు ముందు వచ్చిన జీఎస్టీ సవరణతో ఒకటి రెండు మోడళ్లను మినహాయిస్తే దాదాపు అన్ని రకాల కార్ల మీద ధరలు పెరిగాయి. ఈ ధరల పెంపు వచ్చే మూడు నెలల కార్ల విక్రయాల మీద తీవ్ర ప్రభావం చూపనుంది.


Click it and Unblock the Notifications








