2020 నాటికి తమ అన్ని ఉత్పత్తుల్లో తప్పనిసరిగా ఏఎమ్టి అందివ్వనున్న మారుతి సుజుకి
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ 2020 నాటికి దేశీయ లైనప్లో ఉన్న అన్ని మోడళ్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్ను తప్పనిసరిగా అందిస్తామని పేర్కొంది.
దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ఇతర కార్ల తయారీ సంస్థలకు దడ పుట్టించే ప్రకటన చేసింది. 2020 నాటికి తాము ఇండియన్ మార్కెట్లో అందించే అన్ని ఉత్పత్తుల్లో కూడా ఆటోమేటి ట్రాన్స్మిషన్ కూడా అందివ్వనున్నట్లు తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో 94,000 యూనిట్ల ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లను విక్రయించింది మారుతి. వచ్చే ఏడాదిలో 1.5 లక్షలు మరియు 2020 నాటికి 3 లక్షల యూనిట్ల ఏఎమ్టి ట్రాన్స్మిషన్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి సుజుకి ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సివి రామన్ మాట్లాడుతూ, యాక్సిలరేటర్ మరియు బ్రేక్ మాత్రమే ఉన్న టు పెడల్ టెక్నాలజీ ఉన్న కార్లకు దేశీయంగా డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో తమ లైనప్లో ఉన్న కార్లన్నీ 2020 నాటికి టు పెడల్ టెక్నాలజీతో లభించనున్నాయని తెలిపాడు.

ప్రస్తుతం మారుతి తమ లైనప్లో ఉన్న ఆల్టో కె10, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్ మరియు డిజైర్ కార్లలో ఆటో గేర్ షిఫ్ట్ పేరుతో పిలువబడుతున్న ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను అందుబాటులో ఉంచింది.

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల కార్ల తయారీ గణనీయంగా పెరుగుతోంది. ఇందు కోసం ఏఎమ్టి గేర్బాక్స్ లకు కావాల్సిన విడి భాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేయనున్నారు. తద్వారా దాదాపు అన్ని మోడళ్లలో తక్కువ ధరతో ఏఎమ్టి ట్రాన్స్మిషన్ అందించవచ్చు.

మారుతి తమ ఉత్పత్తుల్లో ప్రవేశపెట్టిన ఏజిఎస్ ట్రాన్స్మిషన్ వేరియంట్లకు కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తోందని రామన్ పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం, సెలెరియో మొత్తం విక్రయాల్లో 40, వ్యాగన్ ఆర్ 13 శాతం, ఆల్టో 15 శాతం మరియు ఇగ్నిస్ 26 శాతం చెప్పున ఆటోమేటిక్ కార్లు అమ్ముడుపోతున్నాయి.

ప్రస్తుతం ఆటోమేటిక్ వేరియంట్ల మార్కెట్ వాటాను గమనిస్తే, మారుతి సుజుకి 47 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీనికి తోడుగా అన్ని మోడళ్లను ఫ్యూయల్ ఎఫీషియంట్ మరియు సేఫ్టీ పరంగా అభివృద్ది చేస్తున్నారు.

భారతదేశపు కార్పోరేట్ సగటు ఇంధన మైలేజ్ నియమాలకు అనుగుణంగా ఇంజన్లలో అప్గ్రేడ్స్ నిర్వహించనుంది. ప్రత్యేకించి మారుతికి అధిక విక్రయాలు సాధించిపెడుతున్న ఏ మరియు బి సెగ్మెంట్లలో ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ మరియు సబ్ కాంపాక్ట్ సెడాన్ కార్లకు అప్గ్రేడ్స్ నిర్వహించనున్నారు.

అదే విధంగా మారుతి సుజుకి ఇప్పటి నుండి తమ లైనప్లో ఉన్న ఉత్పత్తుల్లో బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్లను అభివృద్ది చేస్తోంది. 2020 ఏప్రిల్ నాటికి బిఎస్-6 ఇంజన్లను అందించే లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications








