మహీంద్రా రెక్ట్సాన్ ఎస్యూవీ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దమైంది
మహీంద్రా రెక్ట్సాన్ ఎస్యూవీ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దమైంది.మహీంద్రా సరికొత్త రెక్ట్సాన్ విడుదల వివరాలను వెల్లడించింది.
దేశీయ ప్రీమియమ్ ఎస్యూవీ సెగ్మెంట్లో టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వాహనాలు అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్నాయి. వీటికి పోటీగా విపణిలోకి ఎన్నో మోడళ్లు వచ్చాయి. అయితే, ఏవి కూడా ఈ రెండింటిని ఎదుర్కోలేకపోయాయి.

మహీంద్రా సరికొత్త రెక్ట్సాన్ ఎస్యూవీతో ఈ బరిలోకి దిగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తమ భాగస్వామ్యపు సంస్థ శాంగ్యాంగ్ అభివృద్ది చేసిన రెక్ట్సాన్ ప్రీమియమ్ ఎస్యూవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

శాంగ్యాంగ్ మోటార్స్ ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన 2017 సియోల్ మోటార్ షో లో సరికొత్త రెక్ట్సాన్ను ఆవిష్కరించింది. భారత్లో దీని విడుదల, ధర మరియు ప్రీమియమ్ ఎస్యూవీల పరంగా ఉన్న డిమాండ్ వంటి అంశాల గురించి అధ్యయనం చేస్తోంది.
Recommended Video


తాజాగా అందుతున్న సమాచారం మేరకు, మహీంద్రా ఈ రెక్ట్సాన్ ఎస్యూవీని 2018 ఏడాది మధ్య భాగంలో పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. అంతే కాకుండా, 2017 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో లో మహీంద్రా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్, రాజన్ వాదేరా కూడా ఇండియాలో రెక్ట్సాన్ విడుదల ఉంటుందని స్పష్టం చేసారు.

"పోటీని తట్టుకుని నిలబడేందుకు సరైన ధరలను నిర్ణయించే పనిలో ఉన్నట్లు తెలిపాడు. రెక్ట్సాన్ ఎస్యూవీకి విపణిలో మంచి అవకాశాలు ఉన్నాయి. పోటీతత్వమున్న సెగ్మెంట్లో ధర పరంగా కస్టమర్లను ఆకట్టుకుంటే విజయం ఖచ్చితమని రాజన్ పేర్కొన్నాడు."

నిజానికి దిగుమతి చేసుకుని విక్రయిస్తే, దిగుమతి సుంకం అధికంగా ఉండటంతో ఎక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనైనా తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో రెక్ట్సాన్ ఎస్యూవీలను ఇక మీద ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారు. బాడీ నిర్మాణం, అసెంబుల్ మరియు పెయింట్ జాబ్ మొత్తం మహీంద్రా పర్యవేక్షణలోనే జరగనున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏదేమైనప్పటికీ, ఇంజన్ మరియు ఇతర విడిపరికరాలను కొరియా నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. దేశీయంగా తయారు కానున్న రెక్ట్సాన్ ఎస్యూవీ పొడవు 4.8మీటర్లుగా ఉంది. దీనిని శాంగ్యాంగ్ వారి ఆధునిక ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా నిర్మించనున్నారు.

సాంకేతికంగా ఇది 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్తో రానుంది. ఇది గరిష్టంగా 185బిహెచ్పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త మహీంద్రా రెక్ట్సాన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీనివ్వనుంది. అయితే సరసమైన ధరల శ్రేణిలో విడుదలైతే మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

గతంలో రెక్ట్సాన్ వాహనాలు శాంగ్యాంగ్ బ్యాడ్జి పేరుతో అమ్ముడయ్యేవి, కానీ ఇక మీదట సరికొత్త రెక్ట్సాన్ మహీంద్రా బ్యాడ్జ్తో రానున్నట్లు తెలిసింది. అయితే, దీనిని మహీంద్రా మరియు శాంగ్యాంగ్ అధికారికంగా స్పష్టం చేయలేదు.


Click it and Unblock the Notifications








