నేటి నుండి సెకండ్ ఎడిషన్ ఇండియా బాజ ర్యాలీ ప్రారంభం
ఇండియా బాజ సెకండ్ ఎడిషన్ ర్యాలీ ఏప్రిల్ 7, 2017 న జైసల్మీర్లో ప్రారంభమైంది, ఇండియాలో అత్యంత కఠినమైన ర్యాలీల్లో ఒకటి నిలిచిన దీని గురించి మరిన్ని వివరాలు
ఇండియాలో జరిగే అత్యంత కఠినమైన ర్యాలీలలో బాజ ర్యాలీ ఒకటి. ఇది ఏప్రిల్ 7, 2017 నుండి ఏప్రిల్ 9 వరకు జెసల్మీరులో జరగనుంది. ప్రసిద్దిగాంచిన డకార్ ర్యాలీ ఛాలెంజ్ సిరీస్లో ఇది ఒక భాగం.

ఇండియా బాజ లోని టూ వీలర్ క్లాస్లో విజేతగా నిలిచే వారికి మొరాకోలో జరిగే Afriquia Merzouga Rally ర్యాలీలో ఉచిత ఎంట్రీతో పాటు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ర్యాలీగా పేరుపొందిన 2018 డకార్ ర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

ఫోర్ వీలర్ కేటగిరీలో విజేతగా నిలిచే వ్యక్తికి 2018 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇండియా బాజ ర్యాలీ రెండు రోజులు, ఆరు విభిన్న స్టేజీల్లో సుమారుగా 430 కిలోమీటర్ల పాటు సాగనుంది.

ఇండియా బాజ ర్యాలీలోని టూ వీలర్ కేటగిరీలో హీరో మోటార్ స్పోర్ట్స్ టీమ్ ర్యాలీ రైడర్ జొయాక్విమ్ రోడ్రిగ్యుజ్ మరియు టీవీఎస్ రైడర్లు ఆడ్రియన్ మెట్జ్ మరియు అరవింద్ కె.పిల మధ్య తీవ్ర పోటీ ఉంది.

ఇండియా యొక్క ప్రముఖ రైడర్ సిఎస్ సంతోష్ మెడ భాగంలో గాయం కావడం చేత ఈ ర్యాలీకి దూరమయ్యాడు. ఇతర దిగ్గజ రైడర్లయిన నేషనల్ ఛాంపియన్స్ ఆర్ నటరాజ్ మరియు అబ్దుల్ వహీద్ తన్వీర్ లు ఇందులో పాల్గొంటున్నారు.

నేడు జైసల్మీర్లో జెండా ఊపి ప్రారంభించిన ఇండియా బాజ సెకండ్ ఎడిషన్ ర్యాలీ ఏప్రిల్ 9, 2017 నాటికి క్లైమాక్స్ దశకు రానుంది. ఈ ర్యాలీలో మొత్తం 100 మంది వరకు పోటీదారులు పాల్గొంటున్నట్లు సమాచారం.

డకార్ ర్యాలీ స్పోర్టింగ్ డైరక్టర్ మరియు ఐదు సార్లు డకార్ ర్యాలీ విజేతగా నిలిచిన మార్క్ కోమా మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన దిగ్గజ డకార్ ర్యాలీలో పాల్గొనేందుకు ఇండియాలో ర్యాలీలను నిర్వహించి రైడర్లను నిష్ణాతులు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఈ ర్యాలీలో విజేతగా నిలిచే వారికి డకార్ ర్యాలీ 2018 ఎడిషన్లో పాల్గొనే అవకాశం లభిస్తుండటం చేత ఇండియా బాజ ర్యాలీకి క్రేజ్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications








