ఇప్పటి వరకు జరిగిన టాటా హెక్సా ప్రమాదాల్లో అత్యంత భయంకరమైన యాక్సిడెంట్
నగరంలో పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. మున్సిపల్ వాహనం మరియు టాటా హెక్సా ఎస్యూవీకి మధ్య జరిగిన అత్యంత ఘోరమైన యాక్సిడెంట్, సిటీల్లో శృతిమించిన వేగంతో ప్రయాణించడం ఎంతటి ప్రమాదాకరమో మరో సారి నిరూపించింది.

ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన వాహనంగా పేరుగాంచిన టాటా హెక్సా ఈ ప్రమాదానంతరం గుర్తుపట్టడానికి వీల్లేకుండా నుజ్జునుజ్జయిపోయింది. ఖచ్చితంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందో చూద్దాం రండి....

ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 4:15 గంటల ప్రాంతంలో సంభవించింది. ముంబాయ్ మున్సిపల్ కార్పోరేషన్కు చెందిన ఆటోమేటిక్ స్వీపింగ్ మెషీన్ ట్రక్కు డ్రైవర్ మేరకు, అత్యంత వేగంతో దూసుకొచ్చిన టాటా హెక్సా ట్రక్కు వెనుక వైపున బలంగా ఢీకొట్టింది.

బృహన్ముంబాయ్ మున్సిపల్ కార్పోరేషన్(BMC)కు చెందిన స్వీపింగ్ ట్రక్కు నిర్ణీత వేగంతో రహదారిని శుభ్రం చేస్తోంది. ప్రమాదం జరిగినపుడు ఈ వాహన వేగం చాలా తక్కువ. ఈ ప్రమాదం జరిగిన స్థలిలోనే టాటా హెక్సా మంటల్లో చిక్కుకొంది. ఇందులో ఇద్దరు ప్రయాణిస్తుండగా, ఒకరు వాహనంలోనే ఇరుక్కుపోయి మంటలుకు సజీవదహనమయ్యాడు.

తీవ్ర గాయాలతో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు కెఇఎమ్ హాస్పిటల్కు తరలించారు. అత్యధిక వేగంలో ఉన్న ఎస్యూవీ తొలుత డివైడర్ను ఢీకొట్టింది. ఆ తరువాత ఎదురుగా ఉన్న నెమ్మదిగా వెళుతున్న స్వీపింగ్ వెహికల్ను వెనుక నుండి ఢీకొట్టింది.

డివైడర్ మధ్యలో ఉన్న వైర్ల కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు, ప్రమాదం జరిగినపుడు టాట హెక్సా వేగం గంటకు 120కిలోమీటర్లుగా ఉంది. ఇది పరిమితికి మించిన వేగం.

ప్రమాదంలో ఎస్యూవీ ఎడమవైపున నుజ్జు నుజ్జు కావడంతో డోర్ జామ్ అయిపోయింది. స్థానికులు వాహనంలో ఉన్న సాగర్ను రక్షించి హాస్పిటల్రకు తరలించగా, వెహికల్లోనే ఇరుక్కుపోయిన సచిన్ మరణించాడు.

ముంబాయ్ మున్సిపల్ స్వీపింగ్ మెషీన్ చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నప్పటికీ, ట్రక్కుకు వెనుక వైపునున్న బంపర్ను బలంగా ఢీకొట్టింది. దీని ప్రభావం కూడా హెక్సా ఎస్యూవీ మీద ఎక్కువగానే ఉంది. దీంతో ప్రమాదంలో ఇద్దరికీ విపరీతమైన గాయాలయ్యాయి.

ఈ ఘోర ప్రమదానికి కారణమైన, వాహనం నడుపుతున్న సాగర్ గుర్నాథ్ గైక్వాడ్ మీద నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమైనందుకు ఐపిసి సెక్షన్ 304(A), పబ్లిక్ రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఐపిసి సెక్షన్ 279 మరియు డ్యామేజ్ చేసినందుకు ఐపిసి సెక్షన్ 427 క్రింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Source: DNA


Click it and Unblock the Notifications








