భారత్కు వస్తున్న జాగ్వార్ ఐ-పేస్; దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఈ ఏడాది ఆరంభంలో తమ సరికొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్-ఎస్యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. మునుపటి తరం మోడల్తో పోలిస్తే, ఈ సరికొత్త ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీలో చాలా అప్గ్రేడ్లు ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ వాహనాన్ని జాగ్వార్ ఇండియా తమ అధికారిక భారతీయ వెబ్సైట్లో లిస్ట్ చేసింది. తాజాగా, ఇప్పుడు జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్లను కూడా కంపెనీ తమ అధికారిక భారతీయ వెబ్సైట్లో పేర్కొంది.

ఈ పరిణామాలను గమనిస్తే, అతి త్వరలోనే 2021 జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత్లో కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎస్యూవీని ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ అనే మూడు వేరియంట్లలో అందించనున్నట్లు తెలుస్తోంది. ఇవి మూడు కూడా ఒకే ఒక పవర్ట్రైన్ ఆప్షన్ (ఈవి 400)తో లభ్యం కానున్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మొత్తం 12 రంగులలో (ఫుజి వైట్, కాల్డెరా రెడ్, సాంటోరిని బ్లాక్, యులాంగ్ వైట్, ఇండస్ సిల్వర్, ఫైరెంజ్ రెడ్, సీసియం బ్లూ, బోరాస్కో గ్రే, ఈగర్ గ్రే, పోర్టోఫినో బ్లూ, ఫరాల్లన్ పెరల్ బ్లాక్ మరియు అరుబా) లభ్యం కానున్నట్లు కంపెనీ పేర్కొంది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మజిక్యులర్ లైన్స్ అండ్ క్రీజ్లతో వాలుగా ఉండే బోనెట్ను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో ఎల్ఈడి డిఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడి హెడ్ల్యాంప్లు ఉంటాయి. టాప్-స్పెక్ వేరియంట్ అయిన హెచ్ఎస్ఈ ట్రిమ్లో మాత్రమే మ్యాట్రిక్స్ ఎల్ఈడి హెడ్లైట్లు, హనీకోంబ్ గ్రిల్ మరియు విశాలమైన సెంట్రల్ ఎయిర్-డ్యామ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇంకా ఇందులో అందంగా కనిపించే ఫైవ్-స్పోక్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి టర్న్ లైట్తో కూడిన బాడీ-కలర్ సైడ్ వ్యూ మిర్రర్స్ కూడా ఉంటాయి. ఇది 4682 మిమీ పొడవు, 2011 మిమీ వెడల్పు, 1566 మిమీ ఎత్తు మరియు 2990 మిమీ వీల్ బేస్ కలిగి ఉంటుంది. ఇది సుమారు 174 మిమీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ను కూడా కలిగి ఉంటుంది.

ఈ కారులో 8-వే మరియు 12-వే సెమీ-పవర్డ్ లక్స్టెక్ స్పోర్ట్ సీట్లు, 380 వాట్ మెరీడియన్ సౌండ్ సిస్టమ్, ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, 3డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, హెడ్స్-అప్ డిస్ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎన్నో విశిష్టమైన మరియు విలాసమైన ఫీచర్లు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలోని రెండు యాక్సిల్స్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు సింక్రోనస్ పర్మినెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి మొత్తంగా 395 బిహెచ్పిల శక్తిని మరియు 696 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి చార్జ్పై ఇది 480 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్)ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కారులో 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని 100 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ను ఉపయోగించి 0-80 శాతం నుండి ఛార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. మరోవైపు, 7 కిలోవాట్ ఏసి వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, 10 గంటల వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు.

జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారులో బాగా మెప్పించే విషయం దీని రేంజ్ (మైలేజ్). ఇందులోని బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తే, సిటీ రోడ్లపై ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా షికారు చేయవచ్చు. జాగ్వార్ ఐ-పేస్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి మరియు ఆడి ఇ-ట్రోన్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. ఈ రెండు మోడళ్లు కూడా ఈ ఏడాది చివరి నాటికి భారత్లో విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications








