మహీంద్రా స్కార్పియోలో ఇప్పుడు అదిరిపోయే కొత్త ఫీచర్; ఏంటో తెలుసా?
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అందిస్తున్న స్కార్పియో ఎస్యూవీలో కంపెనీ ఓ కొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో లభిస్తున్న ఈ రగ్గడ్ ఎస్యూవీలోని టాప్ఎండ్ వేరియంట్లు ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే టెక్నాలజీలను సపోర్ట్ చేసే కొత్త టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో లభ్యం కానున్నాయి.

ఈ కొత్త ఫీచర్ మహీంద్రా స్కార్పియో ఎస్9 మరియు ఎస్11 వేరియంట్లలో లభిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఫీచర్ను జోడించినప్పటికీ, దీని ధర మాత్రం మారదు. కంపెనీ ఈ ఫీచర్ను వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. తమ వాహనాలకు క్రమం తప్పకుండా చేసే మోడల్ అప్డేట్స్లో భాగంగా ఈ ఫీచర్ను జోడించినట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా స్కార్పియో టాప్-ఎండ్ వేరియంట్లలో అందిస్తున్న ఈ కొత్త ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే టెక్నాలజీ ఫీచర్ కారణంగా డ్రైవర్లు తమ వాహనానికి కనెక్ట్ అయి, కీలక సమాచారాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్పై యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రదర్శించబడుతుంది.

ఈ ఫీచర్ సాయంతో డ్రైవర్ తన చేతులను స్టీరింగ్ వీల్పై నుండి తీయకుండానే వాయిస్ లేదా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ సాయంతో కొన్ని ఫీచర్లను యాక్సెస్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ డ్రైవర్ పరధ్యానాన్ని తగ్గిస్తుంది మరియు డ్రైవర్ రహదారిపై దృష్టి పెట్టడంలో సహకరిస్తుంది.

స్కార్పియోలో కొత్తగా చేర్చిన ఈ కనెక్టింగ్ టెక్నాలజీ ఆధునిక యుగంలోని టెక్ ట్రెండ్స్కి అనుగుణంగా ఉంటుందని మరియు ఇది వాహనానికి గొప్ప విలువను జోడిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది వినియోగదారులకు సురక్షితమైన మరియు మరింత అనుకూలమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఎస్యూవీలో కొత్తగా అప్డేట్ చేసిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మినహా, ఇందులో వేరే ఏ ఇతర మార్పులు లేవు. స్కార్పియో టాప్ ఎండ్ వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ వీల్పై అమర్చిన ఆడియో మరియు క్రూయిజ్ కంట్రోల్ బటన్స్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా తమ కఠినమైన ఎస్యూవీకి అన్ని రకాల వేరియంట్లలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, ఇంజన్ ఇమ్మొబిలైజర్, యాంటీ-థెఫ్ట్ అలారం ఆటో డోర్ లాక్ మొదలైనవి ఉన్నాయి.

స్కార్పియో రగ్గడ్ ఎక్స్టీరియర్కు ప్రసిద్ది చెందిన మోడల్ మరియు ఇది అగ్రెసివ్గా కనిపించే ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్ను కలిగి ఉంటుంది. ఈ ఎస్యూవీ ఆల్రౌండ్ బాడీ-కలర్ క్లాడింగ్తో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లను కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియోలో 2.2-లీటర్ ఎమ్హాక్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3750 ఆర్పిఎమ్ వద్ద 138 బిహెచ్పి శక్తిని మరియు 1500-2800 ఆర్పిఎమ్ మధ్యలో 320 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ప్రారంభ ధర రూ.11.97 లక్షలుగా ఉంది. కాగా, టాప్ ఎండ్ వేరియంట్లయిన ఎస్9 మరియు ఎస్11 వేరియంట్ల ధరలు వరుసగా రూ14.59 లక్షలు మరియు రూ.15.75 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, పూణే).

మహీంద్రా స్కార్పియో కొత్త ఫీచర్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
మహీంద్రా తమ టాప్ ఎండ్ స్కార్పియో వేరియంట్లలో మెరుగైన కనెక్టింగ్ టెక్నాలజీని ఆఫర్ చేయటం ద్వారా యజమానులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలని చూస్తోంది. స్కార్పియోలో కొత్తగా చేసిన అప్డేట్ యూజర్లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తోంది. ఈ కొత్త ఫీచర్ కారణంగా ఎస్9, ఎస్11 వేరియంట్ల అమ్మకాలు పెరగవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








