మారుతి కార్లపై లాక్డౌన్ ఎఫెక్ట్; భారీ నష్టం!
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కోరనా లాక్డౌన్ కారణంగా భారీగా నష్టపోయింది. గత మే 2020లో మారుతి సుజుకి ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న మూడు తయారీ కేంద్రాల్లో కేవలం 3,714 కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే మారుతి వాహనాల ఉత్పత్తి 98 శాతం క్షీణించింది.

బాంబే స్టాక్ ఎక్సేంజ్లో ఫైలింగ్ సందర్భంగా మారుతి సుజుకి ఈ గణాంకాలను వెల్లడించింది. మే 2020లో మారుతి సుజుకి ఇండియా తమకున్న మొత్తం మూడు ప్లాంట్లలో కేవలం 3,714 కార్లను మాత్రమే తయారు చేయగా గత మే 2019లో మారుతి మొత్తం 1.51 లక్షల కార్లను తయారు చేసింది. అంటే గతేడాది ఉత్పత్తి గణాంకాలతో పోల్చుకుంటే కంపెనీ మొత్తం 98 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

ఈ సమయంలో (మే 2020లో) మారుతి సుజుకి తయారు చేసిన మొత్తం కార్లలో 3,652 ప్యాసింజర్ వెహికల్ విభాగంలో తయారు చేయగా, మిగిలిన 62 వాహనాలను సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వాహనాల విభాగంలో తయారు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సెగ్మెంట్ వారీగా ఉత్పత్తి వివరాలను పరిశీలిస్తే, ఈ సమయంలో (మే 2020లో) మారుతి సుజుకి 401 చిన్న కార్ల (హ్యాచ్బ్యాక్)ను తయారు చేయగా, మే 2019లో 23,000 చిన్న కార్లను తయారు చేసింది. ఈ సెగ్మెట్లో ఆల్టో, ఎస్-ప్రెసో కార్లు ఉన్నాయి.

ఈ ఉత్పత్తి గణాంకాలను గమనిస్తే.. కంపెనీ అందిస్తున్న ఇతర పాపులర్ స్మాల్ కార్స్ అయిన వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వాహనాల ఉత్పత్తి కూడా 98 శాతం తగ్గాయి.

యుటిలిటీ వాహనాల విభాగంలో మారుతి సుజుకి ఇండియా 96 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. మే 2020లో మారుతి ఎర్టిగా, విటారా బ్రీజా, ఎస్-క్రాస్ వంటి వాహనాలు కలిగిన ఈ సెగ్మెంట్లో కంపెనీ కేవలం 928 కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. మే 2019లో కంపెనీ ఇదే సెగ్మెంట్లో 24,000 కార్లను ఉత్పత్తి చేసింది. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం 96 శాతం క్షీణత నమోదైంది.

అమ్మకాల పరంగా కూడా మారుతి సుజుకి భారీ నష్టాలను నమోదు చేసుకుంది. మే 2019లో కంపెనీ మొత్తం 1.34 లక్షల కార్లను విక్రయిస్తే, మే 2020లో కేవలం 18,539 కార్లను మాత్రమే విక్రయించింది. మొత్తంగా అమ్మకాల పరంగా 86 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

ఈ అమ్మకాల్లో మారుతి ఎర్టిగా అధికంగా 2,353 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో వరుసగా డిజైర్ మరియు ఈకో వాహనాలు 2,215 మరియు 1,617 యూనిట్ల అమ్మకాలతో నిలిచాయి.

మే 2020 మారుతి సుజుకి ప్రొడక్షన్ నెంబర్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
వాస్తవానికి మారుతి సుజుకి ఇండియా గడచిన మే నెలలో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అన్ని ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించలేకపోయింది. మే నెలలో కేవలం రెండు వారాల పాటు మాత్రమే ప్లాంట్లలో కార్యకాలాపాలు నిర్వహించింది. ప్రస్తుతం మార్కెట్లో మారుతి కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మారుతి కార్ల నెంబర్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








